కోవిషీల్డ్ వ్యాక్సిన్ వికటించి మహిళకు పక్షవాతం (వీడియో)

by  |
paralyse woman
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ టీకా వికటించి చికిత్స కోసం వచ్చిన మహిళ బంధువులను డబ్బుల కోసం పీడించిన నాంపల్లి కేర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బుధవారం బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి ఎంజే మార్కెట్ సమీపంలోని కేర్ ఆస్పత్రి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… నాంపల్లి పార్ధివాడకు చెందిన రాజ కుమారి(45) రెండ్రోజుల క్రితం హనుమాన్ టేక్డీలోని బస్తీ దవాఖానకు వెళ్లి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ వేయించుకుంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది సేపటికే ఆమెకు పక్షవాతం వచ్చి కాలు, చేయి పని చేయకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

దీంతో కేర్ ఆస్పత్రి యాజమానన్యం చికిత్సకు రూ.1.50 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. బంధువులు రెండు విడతలుగా రూ.75 వేలు చెల్లించారు. ఇదిలా ఉండగా, కొవిడ్ టీకా వికటించి మహిళ ఆసుపత్రి పాలైన విషయాన్ని టీకా వేసిన వైద్యాధికారులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలిసిందే. దీంతో వారు హుటాహుటిన కేర్ ఆస్పత్రికి చేరుకొని బాధిత మహిళను నిమ్స్‌కు తరలించాలని సూచించారు. ఈ మేరకు మిగిలిన బిల్లు, అంబులెన్స్‌కు మరో రూ.4 వేలు అదనంగా చెల్లించాలని ఆస్పత్రి అధికారులు డిమాండ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆస్పత్రి యాజమాన్యంతో గొడవకు దిగారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు కేర్ ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం మహిళను నిమ్స్‌కు తరలించారు.

ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలి

రోగుల నుండి కేర్ ఆస్పత్రి యాజమాన్యం అక్రమంగా డబ్బులు వసూలు చేస్తోందని రాజకుమారి బంధువులు ఆరోపించారు. ఆపదలో ఆస్పత్రికి వచ్చిన వారి నుండి లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేసి, కనీసం మెరుగైన వైద్యం చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే వైద్య ఆరోగ్యశాఖ స్పందించి ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed