నిండుకున్న ఆక్సిజన్.. అయిపోయిన వ్యాక్సిన్ నిల్వలు

by  |
Covid Oxygen
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా సృష్టిస్తున్న బీభత్సం చివరకు ముఖ్యమంత్రిని కూడా తాకింది. రోజుకు వేల మంది వైరస్ బారిన పడుతున్నారు. ఊహించని విపత్తుతో రాష్ట్రంలో అన్నింటికీ తీవ్ర కొరత ఏర్పడింది. ఒకవైపు టెస్టింగ్ సెంటర్లలో కిట్ల కొరత ఏర్పడింది. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకుందాంటే నిల్వలు నిండుకున్నాయి. ఇంకోవైపు ఆపదలో ఉన్నవారికి రెమిడెసివిర్ ఇంజెక్షన్లు దొరకడం లేదు. వీటికి తోడు ఆస్పత్రుల్లో సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడంలేదు. ఎమర్జెన్సీ మెడికల్ కేసులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు నిండిపోవడంతో అడ్మిషన్లు దొరకడంలేదు. చివరికి సామాన్యులకు వైద్య సేవలు దొరకడం గగనంగా మారిపోయింది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ‘రానున్న నాలుగు వారాలు కీలకం‘ అని వైద్యాధికారులు చేస్తున్న హెచ్చరికలు భవిష్యత్తులో ఎలాంటి ఉప్రదవానికి దారితీస్తుందోననే ఆందోలన ప్రజల్లో మొదలైంది.

ఆక్సిజన్ డిమాండ్ పెరగడంతో పదకొండు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మాత్రం మర్చిపోయింది. ఇక్కడ కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో అడ్మిట్ అయినవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తుండడంతో సీరియస్‌గా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. కానీ గణాంకాలకు భిన్నంగా వాస్తవిక పరిస్థితి ఉండడంతో పేషెంట్లు పడరాని పాట్లు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రోజుకు సగటున 250 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే, ఇప్పుడు అది సుమారు 350 టన్నులకు పెరిగిందని డీలర్లు మొత్తుకుంటున్నారు. కానీ రాష్ట్రంతో ఉత్పత్తి సహా వివిధ వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నదని గరిష్టంగా 150 టన్నులు కూడా దాటకపోవడంతో ఆస్పత్రుల్లోని పేషెంట్లకు ఇబ్బంది ఏర్పడింది.

నేడు రాష్ట్రానికి ఏడున్నర లక్షల వ్యాక్సిన్ డోసులు

రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులకు తీవ్ర కొరత ఏర్పడింది. పదిహేను రోజులకు సరిపడా 30 లక్షల డోసుల్ని పంపాల్సిందిగా గత వారం ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ 2.46 లక్షల డోసులు మాత్రమే శనివారం అందాయి. తాజాగా మంగళవారం రాత్రికి మరో ఏడున్నర లక్షల డోసులు రానున్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున ఒకటిన్నర లక్షల డోసుల వినియోగం ఉంటోంది. కానీ కేంద్రం రెండు రోజుల క్రితం రెండున్నర లక్షల డోసులు మాత్రమే పంపడంతో ఆదివారం ‘వ్యాక్సిన్ హాలీడే‘ ప్రకటించింది. సోమవారం మాత్రం సెకండ్ డోస్ వేయించుకోవాల్సినవారికే ప్రాధాన్యత ఇచ్చింది. ముందే టోకెన్‌లు తీసుకున్నవారికి మాత్రమే తొలి డోస్ ఇచ్చింది. మంగళవారం రాత్రికి వ్యాక్సిన్ వచ్చిన తర్వా వాటి పంపిణీకి సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రణాళిక రూపొందించనుంది. ఇందులో ఒక లక్ష కొవాగ్జిన్ డోసులు కాగా మిగిలినవన్నీ కొవిషీల్డ్ డోసులే.

కరోనా టెస్టులకూ కొరతే

ప్రాథమిక స్థాయిలోనే టెస్టులు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని, రోజుకు ఒకటిన్నర లక్షల టెస్టులు చేసే సామర్ధ్యం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చెప్తోంది. కానీ టెస్టింగ్ కిట్‌ల కొరత కారణంగా అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు క్యూ కట్టారు. ప్రైవేటు లాబ్‌లలో టెస్టింగ్ కిట్లు కాస్త అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రం పరిమిత స్టాకు మాత్రమే ఉంది. నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందురోజు టోకెన్లు తీసుకున్నవారికి సైతం పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహించలేకపోయారు సిబ్బంది. తగినన్ని కిట్లు లేని కారణంగా పదుల సంఖ్యలో గంటల తరబడి పడిగాపులు కాశారు.

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లు

ఆస్పత్రుల్లో అడ్మిట్ అయిన పేషెంట్లకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు వాడక తప్పని అనివార్య పరిస్థితుల్లో తగినంత నిల్వలు లేని కారణంగా కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ పెచ్చుమీరిపోయింది. ఎక్కువ ధరకు అమ్ముతున్నవారిని పోలీసులు అరెస్టు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మూసాపేట్‌లోని హెటిరో డ్రగ్స్ (తయారీ సంస్థ) రిటైల్ ఔట్‌లెట్ ద్వారా ఆపదలో ఉన్నవారికి విక్రయించడం మొదలుపెట్టింది. వేలాది మంది పేషెంట్ల అటెండెంట్లు డాక్టర్ల చీటీని పట్టుకుని గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కానీ గంటల వ్యవధిలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక్కొక్కరు అర డజను, డజను చొప్పును కొనుక్కోవడం మళ్ళీ కొరత ఏర్పడింది.

టెస్టు రిపోర్టులు ఇవ్వరు.. అడ్మిషన్లు దొరకవు

ఆస్పత్రుల్లో బెడ్‌లు ఖాళీవి లేకపోవడంతో సిఫారసులు సాధారణమైపోయాయి. కానీ అవి కూడా దాటిపోవడంతో అడ్మిషన్‌లు సాహసంగా మారిపోయాయి. కరోనా పాజిటివ్ టెస్టు రిపోర్టుతో పాటు పేషెంట్ సీరియస్ కండిషన్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్న ఆస్పత్రుల యాజమాన్యాలు అడ్మిషన్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాయి. కానీ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకున్నవారికి 24 గంటల తర్వాత ఇవ్వాల్సిన రిపోర్టు నాలుగైదు రోజులైనా దొరకకపోవడంతో ఆస్పత్రుల్లో చేరడానికి పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అరగంటలో యాంటీ జెన్ రిపోర్టు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మౌఖికంగా మాత్రమే చెప్తూ రిపోర్టు ఇవ్వనందున అడ్మిషన్ సాధ్యం కావడంలేదు. సెకండ్ వేవ్ తర్వాత వైద్యారోగ్య సిబ్బంది పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Next Story

Most Viewed