సైబర్ నేరగాళ్లకు లక్షలు కురిపిస్తున్న కొవిడ్

by  |
cyber criminals
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచాన్ని కొవిడ్ అతలాకుతలం చేస్తోంది. సరిపడ బెడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు కనీసం మెడిసిన్, బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఆక్సిజన్ అందక ఇప్పటికే ఎందరో మరణించారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులు, కుటుంబసభ్యులు ఆక్సిజన్, మెడిసిన్ కోసం ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. కొవిడ్ విజృంభణతో వీరు మరింత రెచ్చిపోతున్నారు. ఆక్సిజన్, మెడిసిన్ అందిస్తామని ఫేక్ కాల్స్, మెసేజులు చేస్తూ సైబర్ మోసాలకు తెరదీస్తున్నారు. దొరికిందే ఛాన్స్ అని అందినకాడికి దండుకుంటున్నారు. అలా మోసపోయిన బాధితుల్లో ఆరుగురు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు దండుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఫేక్ కాల్స్, మెసేజులతో జాగ్రత్త

మీకు కావాల్సిన మెడిసిన్, ఆక్సిజన్ మేం అందిస్తామంటూ ఫేక్ కాల్స్, మెసేజులు చేస్తూ దోపిడీలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు వెబ్ సైట్, వాట్సప్, టెలిగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మెడిసిన్, ఆక్సిజన్ వివరాలకు నకిలీ వెబ్ సైట్ లింకులు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. వెబ్ సైట్ లో వివరాలు అందించిన అనంతరం మెసేజులు, కాల్స్ చేస్తున్నారు. ఆక్సిజన్ కావాలంటే ముందుగానే కొంత మొత్తం చెల్లించాలంటూ నిబంధనలు పెడుతున్నారు. అవసరమైతే తామే వచ్చి డెలివరీ చేస్తామని చెబుతున్నారు. నగదు వేసిన అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. ఆక్సిజన్, మెడిసిన్ వస్తుందని ఆశపడే లోపే మోసపోయామని గ్రహించి బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొవిడ్ ఇబ్బందులు ఒకవైపు ఈ మోసాలు మరోవైపు వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

బ్లాక్ ఫంగస్ పేరిటా దోపిడీ..

బ్లాక్ ఫంగస్ కు సంబంధించిన మెడిసిన్ కొరత తీవ్రంగా ఉండటంతో తమ వద్ద ఉన్న ఫలానా మెడిసిన్లు వాడితే బ్లాక్ ఫంగస్ రాదని అవసరం లేకపోయినా కాల్స్, మెసేజ్ లు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇలాంటి మోసాల బారిన ప్రజలు పడకుండా ఉండాలంటే హెల్త్ డిపార్ట్ మెంట్ తమ అఫీషియల్ వెబ్ సైట్ లో ఎంత మొత్తంలో మెడిసిన్ అందుబాటులో ఉందనే వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుందని, ఆ వివరాల ఆధారంగా మోసపోకుండా కాపాడుకోవచ్చని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్స్ మాత్రమే సేఫ్

ప్రజలు తమకు కావాల్సిన వ్యాక్సిన్, మెడిసిన్, ఆక్సిజన్, హాస్పిటళ్ల వంటి వివరాలను తెలుసుకునేందుకు అఫీషియల్ వెబ్ సైట్స్ ను మాత్రమే వినియోగించాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. లేదంటే మోసపోవాల్సిందేనని వారు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించుకుంటే నష్టపోవడం తప్పదని వారు చెబుతున్నారు. అనవసరంగా ఏ లింక్ పడితే అది ఓపెన్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేసినా సోర్స్ లింక్, ఇతర వివరాలు చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని వారు వివరిస్తున్నారు. కొందరు మోసగాళ్లు ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉన్న డేటాను మొత్తం కాపీ చేసి ఫేక్ వెబ్ సైట్లు కూడా క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.

కొందరు నేరగాళ్లు నకిలీ వెబ్ సైట్ లింకులు పంపించి ఆ లింకును ప్రజలు క్లిక్ చేయగానే ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. అనంతరం వారి ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారి నంబర్లను తెలుసుకొని వ్యాక్సిన్ పేరిట మెసేజ్, కాల్స్ తో మోసం చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏ అప్లికేషన్ వాడాలి అనే విషయాలను తెలుసుకునేందుకు ఎక్స్ పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫేక్ అప్లికేషన్లు గుర్తించాలి

యూజర్లు ఫేక్ అప్లికేషన్లను గుర్తించాలి. ఉపయోగించే యాప్ ను అందించే సంస్థ ఏది అనే విషయాలపై యూజర్లకు అవగాహన ఉండాలి. అంతేకానీ రేటింగ్ చూసి మోసపోవద్దు. వెబ్ సైట్ లో gov.in అని ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్ అని గ్రహించాలి. అలాంటి అఫీషియల్ వెబ్ సైట్ల నుంచి మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. అదే ఒకవేళ వెబ్ సైట్ లో .com అని ఉంటే ప్రైవేట్ లింక్ అని యూజర్లకు అవగాహన ఉండాలి. యూజర్లు కొన్నిసార్లు కామెంట్లు కూడా పరిశీలించాలి. గతంలో ఎవరైనా మోసపోయి ఉంటే వారు కామెంట్ల రూపంలో తెలిపే అవకాశముంది. అలా కొంత జాగ్రత్త పడొచ్చు.
– సందీప్ ముదల్కర్, సైబర్ నిపుణుడు

అవగాహన కల్పిస్తున్నాం..

సైబర్ మోసాల నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు పట్టించుకొని జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటి వరకు ఆరుగురు బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు దండుకున్నారు. నేరం చేసిన వారిపై కేసు నమోదు చేశాం. వీలైనంత త్వరగా నేరగాళ్లను పట్టుకుంటాం. కొన్ని వెబ్ సైట్ల ద్వారా బిడ్డింగ్ నిర్వహించి మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఫేక్ వెబ్ సైట్ల ద్వారా పేమెంట్స్ చేయొద్దు.
-కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైం ఏసీపీ

Next Story

Most Viewed