పత్తిసాగులో తెలంగాణ మార్క్

by  |
పత్తిసాగులో తెలంగాణ మార్క్
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ వానాకాలం పత్తి సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే. 60 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా విజ్ణప్తి చేశారు. అనుకున్నట్టుగానే జరుగుతోంది. బుధవారం నాటి నివేదికల ప్రకారం రాష్ట్రంలో పత్తి పంట 50,41,269 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 44,50,029 ఎకరాలు కాగా, ఇప్పుడు దాన్ని మించి 113 శాతం సాగవుతోంది. రాష్ట్రంలో మొత్తం పంటల సాగు 70 శాతంగా నమోదైంది. గతంలో ఇదే సమయానికి 46,61,633 ఎకరాల్లో పంటలు వేయగా, ఈసారి 72,78,494 ఎకరాల్లో వేశారు. సాధారణ సాగు 1,03,47,715 ఎకరాలు ఉండగా, ఈసారి 1,25 కోట్ల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అనుకున్నట్లుగా పంటల సాగు పెరుగుతోంది. పంటల సాగులో పత్తి అగ్రస్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో 5.52 లక్షల ఎకరాలు, నాగర్ కర్నూల్ లో3.97 లక్షలు, ఆదిలాబాద్‌లో 3.86 లక్షలు, సంగారెడ్డిలో 3.35 లక్షలు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3.27 లక్షలు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2 లక్షల చొప్పున పత్తిని సాగు చేస్తున్నారు. అతి తక్కువగా మేడ్చల్ జిల్లాలో 434, నిజామాబాద్ జిల్లాలో 2722 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు.

మొక్కజొన్నకు కూడా..

ఈసారి మొక్కజొన్న వద్దంటూ సీఎం కేసీఆర్ సూచించినా రైతులు సాగు చేశారు. సాధారణ సాగు 11.76 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 5.27 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ఈ వానాకాలంలో 1.23 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. కామారెడ్డి, నిజామాబాద్, మహబూబాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎక్కువగా వేశారు. వీటితో పాటుగా కంది పంట కూడా ఈసారి పెరిగింది. 7.44 లక్షల ఎకరాల్లో కంది పంటను వేశారు. వరి సాగు కూడా 6,42,198 ఎకరాలకు చేరింది. సాధారణ సాగు 27.25 లక్షల ఎకరాలుగా ఉంది. గతేడాది ఈ సమయానికి 1.66 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి వేశారు. ఈసారి ముందుగానే వరి నాట్లు పడ్డాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాధారణ సాగు 3.25 లక్షల ఎకరాలు ఉండగా, ఇప్పటికే 3.72 లక్షల ఎకరాల్లో వేశారు. ఇక్కడ సాగు శాతం 115 శాతంగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో సాగు శాతం 111 శాతమైంది. నారాయణపేట జిల్లాలో 100 శాతం, సంగారెడ్డిలో 94 శాతం పంటలు పూర్తి అయ్యాయి. దాదాపు అన్ని జిల్లాలో సగటున 70 శాతం పంటలు వేశారు. బుధవారం నుంచి 12 రోజుల పాటు ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో సర్వే చేస్తున్నారు. ప్రతి రైతు నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీని ప్రకారమే రైతుబంధు, ఉచిత ఎరువులు, విత్తనాల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

పంట గతేడాది సాగు ప్రస్తుతం (ఇప్పటి వరకు )
వరి 1,66,096 6,42,198
జొన్న 55,563 96198
మొక్కజొన్న 5,27,378 1,23,715
ఆహార ధాన్యాలు 5,84,745 2,22,622
కంది 4,21,296 7,44,955
మొత్తం పప్పు ధాన్యాలు 5,49,103 8,86,197
ఆయిల్ సీడ్స్ 3,93,719 4,23,465
మొత్తం పంటలు 46,61,633 72,78,494


Next Story

Most Viewed