జూనియర్ కాలేజీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని.. మంత్రికి వినతి పత్రం

by  |
college
X

దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ స్థలంలో జూనియర్ కాలేజీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కు కేటాయించి త్వరితగతిన పనులు చేపట్టాలని 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ మంత్రి మల్లారెడ్డిని కోరారు. కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో మేయర్ కావ్య, డిప్యూటి మేయర్ ఆర్ఎస్ శ్రీనివాస్‌‌‌లతో కలిసి శనివారం మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏకే మురుగేష్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలో ప్రతియేటా వేల సంఖ్యలో పదవ తరగతి చదివి, ఆర్థిక స్థోమత లేక పై చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా 5వ డివిజన్‌లో ఆర్టీసీకి కేటాయించిన స్థలాన్ని (సర్వే నంబర్ 256,257) ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కేటాయించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. పై చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా అంబేడ్కర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను దూర ప్రాంతాలలో కాకుండా ప్రజలకు చేరువలో ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ 258 లో సుమారు మూడు వందల గజాల స్థలంలో ఏర్పాటు చేయాలని మంత్రికి మరో వినతి పత్రాన్ని అందజేశారు. విద్యా, వైద్య సదుపాయాలపై ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే అమలు చేస్తామని మంత్రి సానుకూలంగా హామీ ఇచ్చినట్లు ఏకే మురుగేష్ తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కార్పోరేషన్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. విద్యా, వైద్య రంగాలపై దృష్టి సారించి, త్వరితగతిన అభివృద్ధి చేస్తామని మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారు.


Next Story