ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొ‘రేటు’.. ప్రశ్నిస్తే దాడులు.. మంత్రి చెప్పినా వినరు..!

by  |
ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొ‘రేటు’.. ప్రశ్నిస్తే దాడులు.. మంత్రి చెప్పినా వినరు..!
X

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా వైరస్ బారిన ప‌డిన వారు ప్రాణాలను ఎలా కాపాడుకోవాల‌ని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే.. ఇదే అదునుగా చేసుకొని పైసామే ప‌రమాత్మ అంటూ పలువురు కాసుల‌ క‌క్కుర్తికి పాల్పడుతున్నారు. కరోనా పేషెంట్లకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యులు ప్రతి ప‌నికి ఓ రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఇవ్వకపోతే పేషెంట్‌లను డిశ్చార్జి చేస్తూ.. దాడులు, బెదిరింపులకు సైతం దిగుతున్నారు. ఈ వరుస ఘటనలు ఖ‌మ్మం స‌ర్కారు ఆసుపత్రిలో వెలుగుచూస్తున్నాయి. కొంత మంది సిబ్బంది, హెడ్‌న‌ర్స్‌లు చేసే ప‌నుల‌ు మొత్తం వైద్య రంగానికే మ‌చ్చ తీసుకొస్తున్నాయి.

ప్రైవేట్ ఆసుప‌త్రుల దోపిడీని భరించలేని రోగులు.. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌కు వస్తున్న సమయంలో కొంతమందికి జేబులు నింపాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైద్యులు, నర్సులు, ఎంఎన్‌వోలు, స్వీప‌ర్లు, అంబులెన్స్ డ్రైవ‌ర్లు ఇలా ఎవ‌రికి ఇష్టం వచ్చినట్టు వారు రేట్ ఫిక్స్ చేస్తున్నారు. సాధార‌ణ రోగి వ‌స్తే బెడ్లు లేవంటూనే.. డబ్బులు ఇచ్చే వారికి మాత్రం బెడ్లు కేటాయిస్తున్నారు. దీనికితోడు రోగి అరోగ్య ప‌రిస్థితి విష‌యంగా ఉంటే వీరికి కాసుల వర్షమే అని టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో 340 బెడ్స్ ఉన్నాయి. నిత్యం బెడ్ల కొరత ఉందంటూనే.. రూ. 5 వేలు, 10 వేలకు పడకలు ఎలా ఏర్పాటు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న వారి నుంచి రూ. 20 వేల నుంచి రూ. 50 వేలకు పైగా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగాన్ని మొత్తం బాగా తెలిసిన వారు, అంబులెన్సు డ్రైవర్ల ద్వారా సాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. డబ్బులు కట్టలేని వారు ఆస్పత్రి ఆవరణలోని చెట్ల కింద ఉంటున్న ఘటనలు చాలానే ఉంటున్నాయి. మరికొందరు అయితే, అదే ఆవరణలో ప్రాణాలు కోల్పోవడం మరీ దారుణం.

ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే..

చివరకు ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని పేషెంట్‌లకు ఇవ్వాలన్న డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు ఆస్పత్రి సిబ్బంది. ఇదే ఆస్పత్రిలో ఉచిత భోజనం పెడుతున్న అవి పేషెంట్ల తినడం లేదు. ఒకవేళ భోజనం వచ్చిన సిబ్బంది వారికి పెట్టడం లేదని పలువురు వాపోతున్నారు. దీనికితోడు పేషెంట్‌కు శానిటైజర్, ఇతర వస్తువులు ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. పేషెంట్ బంధువులు అక్కడే నిద్రపోవాలంటే రూ. 200 ఇవ్వాలి.. ఇందేంటని ప్రశ్నిస్తే పేషెంట్‌ను ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జి చేయడం గమనార్హం. దీనికి తోడు ఆస్పత్రి సిబ్బంది పేషెంట్ బంధువులపై దాడులకు దిగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే పేషెంట్ ప్రాణాలు ముఖ్యమని భావిస్తున్న కుటుంబీకులు అడిగినంత ఇవ్వడానికి వెనుకాడటం లేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేటు ధరలు యదేచ్ఛగా సాగుతున్నాయి.

పువ్వాడ అజయ్ చెప్పినా వినడం లేదు..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క‌రోనాను క‌ట్టడి చేసేందుకు, రోగుల‌కు మెరుగైనా చిక్సిత‌ను అందించాల‌ని జిల్లాల వారీగా క‌మిటీలు వేశారు. ఈ క‌మిటీలు జిల్లాలో రోగుల‌కు అందుతున్న వైద్యంపై స‌మాచారాం ఇవ్వాలి. ఖమ్మంలో ఇప్పటివరు మంత్రి పువ్వాడ అధ్యక్షతన మూడు సార్లు హై-ప‌వ‌ర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా వీటిని వైద్యాధికారులు పెడచెవిన పెట్టి.. ఇష్టానుసారంగా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. చివరకు మంత్రి మాటకు లెక్కలేకపోవడంతో.. ప్రశ్నిస్తున్న బంధువులపై సిబ్బంది దాడులకు దిగుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పేషెంట్లు, బంధువులు కోరుతున్నారు.

Next Story

Most Viewed