కరోనాపై సమరానికి మేమే సైతం !

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్ర‌ణ‌కు తాము సైతమంటూ స్వయం సహాయక బృందాల మహిళలు మందుకు వచ్చారు. న‌గ‌రాన్ని నిరంత‌రం ప‌రిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ప్ర‌తి ఇంటి నుండి చెత్త‌ను సేక‌రించి డంప్‌యార్డ్‌కు త‌ర‌లిస్తున్న శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల ర‌క్ష‌ణ‌కు జోన‌ల్ క‌మిష‌న‌ర్ల ద్వారా మాస్కుల‌ను అందించడానికి తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. ఉతికి రెగ్యుల‌ర్‌గా ఉప‌యోగించుకునేందుకు అనువుగా క్లాత్ మాస్కుల‌ను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా అర్బన్ క‌మ్యూనిటీ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో కుట్టు మిషన్ శిక్ష‌ణ పొందిన 200 మ‌హిళా సంఘాల‌కు మాస్కుల త‌యారీ బాధ్య‌త‌ను అప్ప‌గించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ముగ్గురు, న‌లుగురు మ‌హిళ‌లు బృందంగా ఏర్ప‌డి ఈ నెల 8వ తేదీ నుంచి ఇప్పటివరకు 20వేల మాస్కుల‌ను త‌యారుచేశారు. మ‌రో రెండు రోజుల్లో 60వేల మాస్కుల ల‌క్ష్యాన్ని సాధిస్తామ‌ని మ‌హిళ‌లు చెబుతున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌కు చేదోడువాదోడుగా నిలుస్తున్నందుకు మ‌హిళా సంఘాలు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌తి మాస్కుకు రూ. 12 చొప్పున మొత్తం 60వేల మాస్కుల‌కు రూ. 72వేల‌ను జీహెచ్ఎంసీ చెల్లించ‌నుంది. లాక్‌డౌన్ ఉన్నందున వ‌స్త్ర దుకాణ‌దారుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడి అవ‌స‌ర‌మైన క్లాత్ మెటీరియ‌ల్‌ను మ‌హిళా సంఘాల‌కు ఇప్పించారు. ఈ మాస్కుల‌ను శానిటేష‌న్ విభాగంలో ప‌నిచేస్తున్న 20వేల మంది కార్మికుల‌తో పాటు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మొద‌టిసారిగా 2,500 స్వ‌చ్ఛ ఆటోల ద్వారా చెత్త‌ను త‌ర‌లిస్తున్న డ్రైవ‌ర్లు, స‌హాయ‌కుల‌కు రెండు మాస్కుల చొప్పున పంపిణీ చేస్తున్నారు.

Tags: coronavirus, womens, distribution, masks, sanitation workers, GHMC


Next Story

Most Viewed