మే నెలలో కరోనా వ్యాక్సిన్..?

by  |
మే నెలలో కరోనా వ్యాక్సిన్..?
X

వాషింగ్టన్ : చైనాలో పుట్టిన కరోనా వైరస్ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. జలుబు, దగ్గు, జ్వరమేగా అని నిర్లక్ష్యం చేసిన పాపానికి లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. చైనా నుంచి యూరప్ దేశాలకు పాకి అతలాకుతలం చేసిన కొవిడ్-19.. ఆ తర్వాత అగ్రరాజ్యమైన అమెరికాకు చుక్కలు చూపెడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తున్నది. అక్కడ రోజుకు వందల సంఖ్యలో కొవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి అసలు ఏం వైద్యం చేస్తున్నారో కూడా ఏ దేశం బాహాటంగా చెప్పడం లేదు. దీనికి కారణం కొవిడ్-19కు ఇప్పటి వరకు సరైన వైద్య విధానం లేకపోవడమే. పారాసిటమాల్, అజిత్రోమైసిన వంటి ఔషధాలతో పాటు కొద్ది మోతాదులో హైక్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఇవ్వడం ద్వారా జబ్బును నయం చేస్తున్నారు. కాని అన్ని దేశాల్లో, అందరు రోగులకు ఇదే ఫార్ములా పని చేయడం లేదు. రోగి లక్షణాలు, అతడి రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరును బట్టి ఎప్పటికప్పుడు మందులను మారుస్తూ.. సరైన ఆహారం అందిస్తూ కోలుకునేలా చేస్తున్నారు. అయితే దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో పూర్తిగా కోలుకున్న రోగులు కూడా తిరిగి కొవిడ్-19 బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా ఏదైనా జబ్బు పడి చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత అతని శరీరంలో ఆ జబ్బు మళ్లీ వస్తే ఎదుర్కునే యాంటీబాడీలు తయారవుతాయి. కాగా, ఇప్పుడు కొవిడ్-19 వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెడుతుండటంతో.. యాంటీ బాడీలు తయారు కావడం లేదా? లేక వైరస్ తన లక్షణాలను మార్చుకుంటోందా అని వైద్య నిపుణులు అనునమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనాకు వ్యాక్సిన్ కనుగొనడమే ఈ రోగానికి శాశ్వత పరిష్కారం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. కొవిడ్ – 19కి వ్యాక్సిన్ కనుగొనడం లేదా పూర్తి స్థాయి ఔషధాన్ని తయారు చేస్తే తప్ప ఈ వ్యాది ముప్పు మానవులను వదిలిపెట్టదని పలువురు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మరి ఏ దేశమైనా వ్యాక్సిన్ పరిశోధనలు చేస్తోందా..?

అమెరికాలో ట్రయల్స్ :

ప్రస్తుతం కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశం అమెరికా. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలను విస్తృతంగా చేపట్టిన ఆ దేశం మార్చి మొదటి వారంలో ఒక టీకాను కూడా రూపొందించింది. సియాటెల్‌లోని వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు జరిగాయి. అంతేగాకుండా దానిని ఒక వ్యక్తిపై ప్రయోగించబోతున్నట్లు.. అందుకోసం 40 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపింది. కాని ఇప్పటి వరకు దాని ఫలితాలు మాత్రం వెల్లడించలేదు. ఆ టీకా సత్ఫలితాలు ఇచ్చినా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి 10 నెలల సమయం పడుతుందని పరిశోధకులు చెప్పారు. కానీ కరోనా విజృంభిస్తున్న వేళ అంత సమయం వేచి చూడటమంటే ముప్పును కాచుకుని ఎదురుచూడటమేనని వైద్యులు చెబుతున్నారు.

వ్యాక్సిన్‌గా యాంటీవైరల్.. !!

చైనా, జపాన్‌కు చెందిన ఫార్మా కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఒక ఔషధాన్ని కరోనాకు వ్యాక్సిన్‌గా అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నాయి. యాంటీ-వైరల్‌గా ఉపయోగించే ‘ఫవిపిరవిర్’ ఔషధాన్ని వ్యాక్సిన్‌గా మార్చాలని భావిస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రభుత్వం ఝెజియాంగ్ హిసున్ ఫార్మాస్యుటికల్ కంపెనీకి పరిశోధనలు చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు చేసిన ఫలితాలు సానుకూలంగా వచ్చాయని.. త్వరలోనే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు జపాన్‌లోని టయోమా కెమికల్ కంపెనీ ఇదే ఔషధాన్ని ‘అవిగన్’ పేరుతో ఉత్పత్తి చేస్తోంది. ఆర్ఎన్ఏ వైరస్‌లను అడ్డుకోగల శక్తి ఈ మందుకు ఉంది. ఈ మందును కరోనా బాధితులపై ప్రయోగించి.. సత్ఫలితాలు ఇస్తే దీన్నే వ్యాక్సిన్‌గా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.

ఇక అమెరికాలో ఎబోలా, జికా వైరస్‌లకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన ఇనోవియా ఫార్మాస్యుటికల్స్ కంపెనీ త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ తీసుకొని రావడానికి ప్రయత్నిస్తోంది. కరోనా వైరస్ జనటిక్ సీక్వెన్స్‌ను ఇప్పటికే చైనా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. దీని ఆధారంగా ఇనోవియా ఫార్మా పరిశోధకులు వ్యాక్సిన్‌కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఎలుకల మీద పరిశోదనలు జరుగుతున్నాయి. ఇది కనుక సత్ఫలితాలు ఇస్తే.. వెంటనే మనుషులపై ప్రయోగాలు చేపడతామని కంపెనీ చెబుతోంది.

వచ్చే నెలాఖరులోగా.. ?

ఇక ఈ కరోనా వ్యాక్సిన్ తయారిలో అన్నిటికంటే ముందుంది అమెరికాలోని గిలియెడ్ సైన్స్ అనే ఫార్మా కంపెనీ. ఈ సంస్థ కోవిడ్-19 మహమ్మారిపై ఒక చికిత్సా పద్ధతిని కనిపెట్టింది. ప్రస్తుతం చికాగోలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగులపై ఈ చికిత్స పద్దతిని ప్రయోగించింది. అమెరికాలోని దాదాపు 152 ప్రాంతాల్లో ఉన్న రోగులకు ఇదే పద్దతిలో గిలియడ్ సైన్స్ చికిత్సను అందిస్తోంది. ఈ చికిత్సా విధానంలో కోవిడ్-19 రోగులకు జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోస సంబంధిత సమస్యలు అతి వేగంగా తగ్గిపోయాయి. అంతే కాకుండా ఈ విధానంలో చికిత్స తీసుకున్న రోగులు కేవలం వారం రోజుల్లోనే కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ పద్దతిపై మరిన్ని ప్రయోగాలు చేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని గిలియెడ్ సంస్థ తెలిపింది. గిలియెడ్ సంస్థ కరోనాతో బాధపడుతున్న మూడో దశ రోగులపై చేసిన పరీక్షలు కూడా విజయవంతం అయ్యాయి. వీటన్నింటికీ సంబంధించిన వివరాలు మే తొలి వారంలో వస్తాయని.. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వెంటనే వ్యాక్సిన్, ఔషధాలను పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని ఆ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.

కేవలం గిలియెడ్ ఫార్మా కంపెనీ ప్రయోగాల కోసమే 113 మంది కొవిడ్-19 రోగులు చికాగో ఆసుపత్రిలో చేరగా.. వారందరికీ కరోనా పూర్తిగా తగ్గిపోయింది. ఆ ఆస్పత్రిలో చేరిన రోగులు త్వరితగతిన కోలుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రపంచ ఫార్మా కంపెనీలు గిలియెడ్ సైన్స్ అభివృద్ధి చేసిన చికిత్సా విధానంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఔషధాన్ని మార్కెటింగ్ చేయడానికి ప్రపంచ మార్కెట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మే నెలాఖరులోగా కరోనాకు పూర్తి స్థాయిలో చికిత్స, వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఫార్మారంగ నిపుణలు చెబుతున్నారు.

Tags: coronavirus, pandemic, medicine, vaccine, antiviral, us, china


Next Story