ఇండియాపై కరోనా ప్రభావం స్వల్పమే!

by  |
ఇండియాపై కరోనా ప్రభావం స్వల్పమే!
X

ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలను భయపెడుతున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం ఇండియాపై పెద్దగా లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. చైనా ఆర్థిక వ్యవస్థ అత్యధిక పరిమాణంలో ఉండటం వల్ల ప్రపంచ జీడీపీ, వాణిజ్యంపై దాని ప్రభావం కచ్చితంగా ప్రభావం ఉంటుందని అన్నారు. ఇండియాలో కొన్నిరంగాలకు మాత్రం కొంతమేరకు అంతరాయం ఉంటుందని, సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని దాస్ స్పష్టం చేశారు. ముడిసరుకుల విషయంలో దేశీయ ఫార్మా, ఎలక్ట్రానిక్ తయారీ రంగాలు ఎక్కువగా చైనాపై ఆధారపడటమే దీనికి కారణమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

దేశీయ పరిశ్రమలపై కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం గురించి ప్రభుత్వం త్వరలో తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పిన ఒకరోజు తర్వాత ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ధరల పెరుగుదల గురించి ఎలాంటి ఆందోళనలేదని ఆర్థికమంత్రి అన్నారు. అయితే, ఇండియాకు చైనా ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని, దేశీయ ఫార్మా, ఎలక్ట్రానిక్ తయరీ రంగాలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అయ్యే ముడి సరుకులపై ఆధారపడ్డాయని, అందువల్లే కోవిడ్-19 ప్రభావం ఆ రంగాలపై అధికంగా కనబడుతుందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చైనాలో ఎగుమతులను నిలిపేయడం వల్ల మనఫార్మా తయారీదారుల వద్ద నిల్వలు తగ్గుతున్నాయి, ఇప్పటికైతే తయారీదారుల వద్ద మూడు నెలలకు సరిపడా సరుకులన్నాయని అన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తయారీదారులు ఆసియాలోని ఇతర దేశాలతో ముడిసరుకుల విషయంలో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

గతంలో చైనాలో పుట్టిన సార్స్ కారణంగా చైనా ఆర్థికవృద్ధి ఒక శాతం తగ్గిందని శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ఆ సమయంలో చైనా ప్రపంచ జీడీపీలో 4.2 శాతం వాటాతో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని ప్రస్తావించారు. ప్రస్తుతం చైనా, ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారి, జీడీపీలో 16.3 శాతం వాటాతో అంతర్జాతీయ వాణిజ్యంపై స్పష్టమైన ప్రభావం కలిగి ఉందని దాస్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌పై స్వల్పమే అని అన్నారు. మందగమనస్థితి నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని దాస్ అన్నారు. ప్రభుత్వం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు ఇలాగే ఉండాలని, అప్పుడే డిమాండ్ పెరిగి నిలదొక్కుకునే అవకాశముంటుందని పేర్కొన్నారు.

ఇటీవల విడుదల చేసిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనల్లో కార్పొరేట్ పన్నుసహా కేంద్రం తీసుకున్న కీలకమైన చర్యలు వినియోగాన్ని, డిమాండ్‌నూ సానుకూలస్థితిలోకి తీసుకెళ్లాయని తెలిపారు. భూముల వ్యవహారాలకు సంబంధించి సంస్కరణలు, మానవ వనరుల అంశంలో నైపుణ్యాన్ని పెంచే నిర్ణయాలు ప్రస్తావించాల్సిన అంశాలని దాస్ వివరించారు. మందగమనాన్ని ఆర్‌బీఐ ముందే ఊహించిందని, అందుకే బ్యాంకులకిచ్చే ఋణాలపై రెపోరేటును ఐదుసార్లు వరుసగా తగ్గించినట్టు దాస్ వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు పెరిగిపోవడం, కార్పొరేట్ ఋణాలు భారమవడం, అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన అనిశ్చితులు ఏర్పడటం వంటి వాటివల్లే దేశీయంగా ఆర్థికవ్యవస్థ మందగమనంలో పయనిస్తోందని అన్నారు. ఇదివరకటి కంటే ఇప్పుడిప్పుడే పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. భవిష్యత్తుల్లో ఈ పరిణామాల ఫలితాలు ఎలా ఉండబోతాయో చూడాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

Next Story

Most Viewed