రియాల్టీ ఢమాలేనా ?

by  |
రియాల్టీ ఢమాలేనా ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా రియల్ ఎస్టేట్ రంగంపై విఫరీతంగా ఉంది. నివాస ప్రాంతాల కంటే వాణిజ్య ప్రాంతాలపై తీవ్రంగా కనిపిస్తోంది. ప్రజలు కొవిడ్-19 నేర్పిన పాఠాలతో ఖర్చులకు వెనుకడుగు వేస్తున్నారు. దానికి తోడు సంపాదన కూడా తగ్గింది. అందుకే నిత్యావసర వస్తువులు తప్ప లగ్జరీ ఐటెమ్ కొనడానికి ఆసక్తి చూపట్లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో గతేడాది ఏప్రిల్- జూన్, ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసిక ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తే ఘోరంగా పడిపోయినట్లు అనేక సంస్థల విశ్లేషణలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఐతే అన్ని నిర్మాణరంగ సంస్థలు వారు నిర్మిస్తోన్న కమర్షియల్ భవనాల్లో స్పేస్ ధరలను తగ్గిస్తున్నాయి. రానున్న రోజుల్లో నివాస ప్రాంతాలకు కాస్తో కూస్తో గిరాకీ ఉండే అవకాశం ఉంది. కానీ వాణిజ్య భవనాల కొనుగోలు ప్రశ్నార్ధకంగానే ఉంది. ఇప్పుడు నిర్మాణంలోని స్పేస్‌ను సాధ్యమైనంత త్వరితగతిన అమ్మేసుకోవడానికి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు ఓ బిల్డర్ చెప్పారు. సిమెంటు, స్టీలు ధరలు పెరుగుతున్న క్రమంలో నిర్మాణాలపై 10 నుంచి 15శాతం వరకు భారం పడుతుంది. ఐతే మొదలుపెట్టిన కమర్షియల్ భవనాలను మధ్యలో ఆపేస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరో వైపు వాటిని నివాస ప్రాంతాలుగా మార్చే అవకాశం లేకుండా పోయింది.

ఇక తగ్గుముఖమే..

కరోనాకు ముందు హైదరాబాద్ కళకళలాడింది. పలు రంగాలకు సంబంధించిన అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు. ఇప్పుడు పర్యాటకుల రద్దీ లేదు. వ్యాపారం లేదు. దాంతో వ్యాపారాలపై 75శాతం ప్రభావం పడింది. కేవలం ఫుడ్ ఐటెమ్స్ తప్ప మరే వ్యాపార రంగం కులాసాగా లేదు. ఎటొచ్చి కరోనా ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై బాగానే పడినట్లు కనిపిస్తోంది. గడిచిన త్రైమాసికంలోనే హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ధరలు పడిపోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో మరే ఇతర నగరాల్లో లేనట్లుగా ఇక్కడ అమ్మకాలు పడిపోయాయి. 2019-20 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్-జూన్ లో హైదరాబాద్ మార్కెట్లో 4,430 యూనిట్ల వరకు విక్రయాలు జరిగాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ వరకు తీసుకుంటే కేవలం 660 యూనిట్లు మాత్రమే అమ్మినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ స్పష్టం చేసింది. అంటే 85 శాతం పడిపోయింది. అదే బెంగుళూరులో 77శాతం, పుణెలో 79శాతం, చెన్నైలో 84శాతం, కోల్‌కతాలో 79 శాతం విక్రయాలు తగ్గినట్లు తెలిపింది.

మ్యాజిక్ బ్రిక్స్ ప్రకారం- వాణిజ్య స్థలాల ధరలు

ఐటీ కారిడార్‌లో అధిక ప్రభావం

ఐటీ కారిడార్‌లో వాణిజ్య భవనాలపై తీరని ప్రభావం చూపిస్తోంది. ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు విస్తారంగా వస్తాయన్న ఆశలతోనే నిర్మాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో వర్క్ ఫ్రం హోం సక్సెస్ ఫలితాలను సాధిస్తుండడంతో విస్తరణ యోచనలను విరమించుకుంటున్నారని ఐటీ నిపుణులు చెబుతున్నారు. తక్కువ మౌలిక సదుపాయాలతోనే లక్ష్యాలను అందుకుంటున్నప్పుడు కొత్తగా విస్తరించడం ద్వారా ఖర్చును పెంచుకోవడం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలోనే తెలంగాణ నంబర్ 1 గా నిలిచినప్పటికీ కరోనా ప్రభావం అన్ని ప్రాంతాలపైనే పడింది. పరిశ్రమలను, కార్పొరేట్ సంస్థలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ రెడ్ కార్పెట్ వేశారు. మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారు. దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించారు. కానీ ఇవన్నీ కరోనా ముందు పని చేయకుండా పోతున్నాయి. కరోనా వైరస్ నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తే తప్ప ఇప్పుడప్పుడే కమర్షియల్ స్పేస్ కు లభించే ఆదరణపై స్పష్టత లభించేటట్లు లేదు.

Next Story

Most Viewed