కరోనా ప్రభావం పురుషులపైనే అధికమా?

by  |
కరోనా ప్రభావం పురుషులపైనే అధికమా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం మహిళల కంటే పురుషుల మీదే ఎక్కువగా ఉందా? కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పురుషుల్లోనే అధికమా? అంటే ఔననే చెబుతున్నాయి రిపోర్ట్స్. ప్రపంచ వ్యాప్తంగా 2, 36,000 మంది ప్రజలు కరోనా బారిన పడి బాధపడుతుండగా… 9,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారట.

కరోనా ఎఫెక్ట్ చైనా తర్వాత ఇటలీలోనే అధికంగా ఉంది. చెప్పాలంటే కరోనా వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన.. అత్యధికంగా ఎఫెక్ట్ పడింది మాత్రం ఇటలీపైనే. అక్కడ 41వేల మంది ప్రజలు కరోనా బారిన పడగా… ఇప్పటి వరకు 3,400 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ అక్కడ మరణమృదంగం మోగుతూనే ఉంది. అయితే ఆ దేశ పబ్లిక్ రీసెర్చ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల్లో 60 శాతం మంది పురుషులే ఉండగా… 70 శాతం మంది పురుషులు ఈ వ్యాధి బారిన పడి చనిపోయారట.

ఇటలీ రిపోర్ట్‌నే పోలి ఉంది చైనా నివేదిక కూడా. చైనాస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ ప్రకారం ఆ దేశ కరోనా మరణాల్లో 64 శాతం మంది పురుషులేనట. సౌత్ కొరియాలో మాత్రం పాజిటివ్ కేసుల్లో మహిళలు అధికంగా (61 శాతం) ఉన్నా.. కోవిడ్ 19 వ్యాధితో మరణించిన వారిలో పురుషుల సంఖ్యే ఎక్కువ. అక్కడ 54 శాతం మంది పురుషులు కరోనా కారణంగా ప్రాణాలు విడిచారట.

ఇందుకు శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం… వైరల్ ఇన్ఫెక్షన్లకు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధితమైన వ్యాధులను అడ్డుకునేందుకు మహిళల్లో రోగ నిరోధక శక్తి పురుషుల్లో కన్నా అధికంగా ఉంటుందట.

Tags : CoronaVirus, Covid19, Men, Women, World Wide

Next Story