బల్దియా కార్మికులకు ‘కరోనా’ భయం

by  |
బల్దియా కార్మికులకు ‘కరోనా’ భయం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా భయంతో బల్దియా కార్మికులు భయపడిపోతున్నారు. ప్రతిరోజు హైదరాబాద్ మహా నగరాన్ని శుభ్రం చేయడమే గాక క్వారంటైన్‌లో ఉన్నవారికి ముద్రలు వేస్తూ, నేరుగా కలుస్తుండటంతో బిక్కు బిక్కు మంటున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వీరందరికీ మాస్క్‌లు ఇచ్చామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజానికి డ్యూటీలు నిర్వహిస్తున్న కార్మికులు వద్ద అలాంటివేమీ కనిపించకపోవడం గమనార్హం.

జీహెచ్ఎంసీ పరిధిలో 18వేల మంది కార్మికులతో పాటు 20వేల మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తూ హైదరాబాద్‌ను సుందరంగా తయారు చేస్తారు. సెక్యూరిటీ గార్డులు, ఆఫీస్ క్లర్క్‌, స్టాప్, హెల్పర్లు అదనం. కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దే ఉంటున్నా జీహెచ్ఎంసీ కార్మికులు మాత్రం విధుల్లోనే ఉంటున్నారు. రోడ్లను ఊడ్చడం, చెత్తను ఏరివేసి వాహనాల్లో తరలించడం వంటి పనులు చేస్తున్నారు. అంతేగాక ఇళ్లలో సెల్ఫ్‌ క్వారంటైన్ చేస్తున్న వారి కోసం స్ప్రే చేయడం, ఆయా ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం వంటి పనులు చేస్తుండటంతో తమకు ఎక్కడ కరోనా వైరస్ అంటుకుంటుందో అన్న భయంతో వణికి పోతున్నారు.

వారంరోజుల క్రితం కార్మికులకు మాస్క్‌లు పంపిణీ చేసిన అధికారులు.. ప్రత్యేకమైన డ్రెస్‌లు, రక్షణ పరికరాలు, శానిటైజర్లు మాత్రం ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా సాధారణ మాస్కులే ఇచ్చి, అప్పటి నుంచి పట్టించుకోవడమే మానేశారు. కానీ బల్దియా పరిధి అధికారులు, సిబ్బందికి తలో రకంగా మాస్క్‌లు పంపిణీ చేయడం గమనార్హం. పెద్ద అధికారులకు ఎన్-95 మాస్క్‌లు.. కిందిస్థాయి సిబ్బందికి సాధారణ నాణ్యతో ఉన్న మాస్క్‌లు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో హోం క్వారంటైన్ కోసం విధులు నిర్వహిస్తున్న కార్మికులు తమను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ, మాస్క్‌లు, డ్రెస్‌లు ఇవ్వాలని అడిగితే కార్మికులను డ్యూటీల నుంచి తొలగిస్తామంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం.

Tags: Ghmc, Corona, ktr, bonthu, mayor, Hyderabad,

Next Story

Most Viewed