లొంగిపోయిన నక్సల్స్ దంపతులకు కరోనా..

by  |
లొంగిపోయిన నక్సల్స్ దంపతులకు కరోనా..
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంకేర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సల్స్ అర్జున్ తాతి (28), లక్ష్మి (22) లకు కరోనా పాజిటివ్‌గా తేలింది.‌ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ దంపతులు మధ్వవర్తుల ద్వారా కోయిలిబెడా బిఎస్ఎఫ్ క్యాంపులో బుధవారం లొంగిపోయారు. వీరికి గురువారం కాంకేర్‌లో కోవిడ్ పరీక్షలు చేయించగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో వీరికి కాంకేర్‌లోని కోవిడ్ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. లొంగిపోయిన నక్సల్స్ దంపతులకు మెరుగైన వైద్యం కోసం మెడికల్ టీమ్‌కి కాంకేర్ జిల్లా కలక్టర్ చందన్‌కుమార్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్. పి, కాంకేర్ ఎస్‌పి ఎంఆర్ అహిరే ఆసుపత్రిని సందర్శించి నక్సల్స్ దంపతులకు ధైర్యం చెప్పారు.

పార్తాపూర్ ఏరియా కమిటీ సభ్యులు అర్జున్ తాతి, లక్ష్మి దంపతుల మాదిరిగానే అనారోగ్యంతో బాధపడుతున్న నక్సల్స్ అరణ్యం వీడి వస్తే వైద్యం చేపిస్తామని కాంకేర్ డిఐజి వినీత్ ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా దండకారణ్యంలో సుమారు 100 మంది నక్సల్స్ కరోనా బారినపడినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అర్జున్, లక్ష్మి దంపతులకి వచ్చిన పాజిటివ్ రిపోర్టు ఆ వార్తలకు బలం చేకూర్చింది. లొంగిపోయిన వారికి ప్రత్యేక సదుపాయాలతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు కరోనా వైద్యం చేయిస్తుండటంతో అర్జున్, లక్ష్మిల అడుగుజాడల్లో మరికొందరు నక్సల్స్ లొంగుబాట పట్టే అవకాశాలు లేకపోలేదు.



Next Story

Most Viewed