క్వారంటైన్‌ పొమ్మంటే తుర్రుమన్నాడు

by  |
క్వారంటైన్‌ పొమ్మంటే తుర్రుమన్నాడు
X

దిశ‌, ఖ‌మ్మం :
తోటి స్నేహితులకు కరోనా వచ్చి ఒకరు మృతిచెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో వారితో సన్నిహితంగా మెలిగిన ఓ వ్యక్తిని గ్రామస్థులు క్వారంటైన్‌‌లో ఉండాలని చెప్పగా ఎవరికీ చెప్పకుండా తుర్రు మన్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, మొరంపల్లి బంజర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..గ్రామానికి చెందిన పోరిపల్లి ఉప్పారావు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. క‌రోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్డౌన్ విధించింది.దీంతో అతను నగరంలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో అతడికి స‌న్నిహితంగా ఉన్న ఇద్ద‌రు స్నేహితుల‌కు క‌రోనా రావ‌డం, అందులో ఒక‌త‌ను ఇప్ప‌టికే మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఉప్పారావు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉండ‌గా కొద్దిరోజులుగా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. క్వారంటైన్‌‌లో ఉండటం ఇష్టం లేని అతను మొదట హైదరాబాద్ నుంచి వాళ్ళ అత్త గారి ఇంటికి వెళ్ళాడు. వారు ఇంట్లోకి రానివ్వడానికి నిరాకరించడంతో మొరంపల్లి బంజర్‌కు చేరుకున్నాడు. విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్థులు అత‌డిని క్వారంటైన్‌కు త‌ర‌లించేందుకు ప్రయత్నించారు. క్వారంటైన్‌కు వెళ్తే మంచిద‌ని సర్పంచ్ బి.దివ్య శ్రీ, ఎంపీటీసీ యారం వెంకటేశ్వర్లు ఎంత న‌చ్చ‌జెప్పినా వినకుండా పారిపోయాడు. అతని చేష్టల ద్వారా గ్రామంలో ఎంతమందికి వైరస్ సంక్రమిస్తుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story

Most Viewed