హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్..!

by  |
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్..!
X

దిశ, క్రైమ్‌బ్యూరో : నగరంలో పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. వాహనదారులను దగ్గరి నుంచే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో పోలీసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలలో గత రెండు వారాలుగా డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ను అనధికారికంగా నిలిపివేశారు. కానీ, వాహనదారుల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్నట్టుగా కన్పించేందుకు ప్రధాన రోడ్ల వద్ద మోహరిస్తున్నారు.

వెంటాడుతున్న భయం..

హైదరాబాద్ నగర పోలీసులను కరోనా భయం వెంటాడుతోంది. కరోనా కట్టడికి వారియర్లుగా పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలలో పోలీసులది క్రీయాశీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, గతేడాది కరోనా మొదటి వేవ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలకు చెందిన 6 వేలకు పైగా పోలీసులకు పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యింది. వీరిలో సుమారు 50 మంది మృతి చెందారు. కరోనా బారిన పడిన వారిలో హోంగార్డుల నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకూ ఉన్నప్పటికీ, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్‌స్పెక్టర్ స్థాయిల్లో మాత్రమే కరోనా ఎఫెక్ట్ అయ్యింది.

ఈ ఏడాది సెకండ్ వేవ్‌లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్‌గా పిలవబడుతున్న పోలీసులను కరోనా వదలడం లేదు. పోలీసు శాఖలో ఇప్పటికే అనేక మందికి పాజిటివ్ నమోదు కాగా, ఈ సంఖ్యను ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించడం లేదు. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో మినిమం 3కు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా బంజారాహిల్స్ పీఎస్‌లో ఇప్పటికే 25 మందికి పాజిటివ్ రాగా, టాస్క్ ఫోర్స్ విభాగంలోనూ 20 మందికి కరోనా వచ్చినట్టు సమాచారం.

డ్రంకెన్ డ్రైవ్‌తో ఆదాయం, ఆందోళన

పోలీసు శాఖకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు చేయడం కారణంగా విధించే చలాన్లతో పాటు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల ద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్ పరిధిలో 2019లో 29,756 డ్రంకెన్ డ్రైవ్ కేసుల ద్వారా రూ.9.29 కోట్లు, 2020లో 5,590 డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదు చేయడంతో రూ.5.20 కోట్ల ఆదాయం జరిమానాల రూపంలో వచ్చింది. సైబరాబాద్‌లో 2019లో 21 వేల కేసుల ద్వారా రూ. 3.85 కోట్లు, 2020లో 8,399 కేసుల ద్వారా రూ.2.10 కోట్లు, రాచకొండలో 2020 ఏడాదికి 3,508 కేసుల ద్వారా రూ.56.35 లక్షలు జరిమానాల రూపంలో డిపార్ట్మెంట్‌కు ఆదాయం సమకూరింది.

అయితే, మద్యం సేవించిన వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయాల్సి వస్తోంది. అంతే కాకుండా, డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ సమయంలో కచ్చితంగా ధరించిన మాస్క్ కూడా తొలగించాల్సి వస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాహనదారుల నుంచి పోలీసులకు, పోలీసుల నుంచి వాహనదారులకు వైరస్ వ్యాపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డిపార్ట్మెంట్‌కు వచ్చే ఆదాయం, నిబంధనలను కాసేపు పక్కన పెట్టాలని పోలీసు అధికారులు భావించారు. దీంతో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వారాలుగా నిలిపివేశారు

Next Story

Most Viewed