కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు

by  |
కరోనా విజృంభణ.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత తొలిసారిగా లక్షకు పైగా కొత్త కేసులు 24 గంటల వ్యవధిలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకురావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబరు 17వ తేదీన 97,894 కేసులు నమోదు కావడం ఇప్పటివరకు అత్యధిక రికార్డు. కానీ ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి 1,03,558 కొత్త కేసులు కేవలం 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి. ఇందులో సగానికి పైకా కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉన్నాయి. సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం ప్రస్తుతానికి తొమ్మిది రాష్ట్రాల్లోనే ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల మధ్య రాకపోకలతో ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. కరోనా వైరస్‌లో కొత్తకొత్త స్ట్రెయిన్‌లు పుట్టుకురావడమే కాక రెండు స్ట్రెయినల్‌లు కలిసి రూపాంతరీకరణ చెందడం సరికొత్త ప్రమాదాన్ని తీసుకొచ్చిందని వైద్యులు బలంగా అనుమానిస్తున్నారు.

కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ఉండడంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చొరవ తీసుకుని కట్టడి చేయడం కోసం కేంద్ర వైద్యారోగ్య బృందాలను అక్కడికి పంపిస్తున్నారు. మొత్తం నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఈ రాష్ట్రాల్లోనే ఉంటుండంతో అక్కడ కట్టడి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాక కేంద్ర ప్రభుత్వానికి కూడా సవాలుగా మారింది. గడచిన 24 గంటల్లో నమోదైన మొత్తం 1,03,558 కేసుల్లో 57,074 ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ముంబాయి నగరంలో సైతం అత్యధికంగా 11,163 కొత్త కేసులు కేవలం 24 గంటల్లో నమోదై సరికొత్త రికార్డు సృష్టించినట్లయింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తున్నారు.

ఒక్కసారిగా ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడానికి కారణం సోషల్ డిస్టెన్స్ నిబంధనను పాటించకపోవడమేనని రాష్ట్ర, కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. కరోనా నిబంధనలను పక్కాగా పాటించినట్లయితే వైరస్ వ్యాప్తి ఈ స్థాయికి వచ్చేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ అనే విధానాన్ని ఇంతకాలం పాటించినా ఇప్పుడు మరో రెండు కొత్త అంశాలను కొవిడ్ బిహేవియర్ విషయంలోనూ మార్పు రావాలని, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ‘దో గజ్ కీ దూరీ’ అని చెప్పినా పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో వారు పాల్గొనే సభల్లో దాన్ని పాటించలేదు. ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా…

కొత్త కేసులు : 1,03,558
మృతులు : 478 మంది

ఇప్పటివరకు…

మొత్తం కేసులు : 1,25,89,067
యాక్టివ్ కేసులు : 7,41,830
రికవరీ : 1,16,82,136 మంది
మొత్తం మృతులు : 1,65,101 మంది
రికవరీ రేటు 92.80%
మరణాల రేటు 1.31%.



Next Story

Most Viewed