విదేశాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్.. ఎయిర్‌పోర్ట్ నుంచి తప్పించుకుని కుత్బుల్లాపూర్‌లో ప్రత్యక్షం

by  |
Corona-Patient1
X

దిశ, కుత్బుల్లాపూర్: విదేశాల నుండి వచ్చిన కరోనా రోగి కుత్బుల్లాపూర్ లో ప్రత్యక్షమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ గణేష్ నగర్ సమీపంలోని రిడ్జ్ టవర్స్ కు చెందిన ఓ యువతి(36) విదేశాల్లో ఉంటుంది. అయితే గురువారం సాయంత్రం తిరిగి వచ్చిన ఆ యువతికి శంషాబాద్ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. అధికారులు హాస్పిటల్ కు తరలించే క్రమంలో అక్కడి నుండి తప్పించుకొని ఆటోలో రిడ్జ్ టవర్స్ లో ఉండే తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు పాస్ పోర్ట్ ఆధారంగా చిరునామా గుర్తించి సదరు ప్రాంత జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ బాలరాజుకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, వైద్య శాఖాధికారులు రిడ్జ్ టవర్స్ కు చేరుకోగా ఆమె అక్కడి నుండి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసిందని, అసోసియేషన్ తో పాటు స్థానికుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి లోని టిమ్స్ కు తరలించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ కు తరలించారు. కరోనా పెరుగుతుండడంతోపాటు ఒమిక్రాన్ వైరస్ కారణంతోనే తరలించినట్లు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed