ఎంపీ రేవంత్ రెడ్డి చొరవ.. దాతల సహకరంతో కరోనా వైద్య సేవలు

by  |
ఎంపీ రేవంత్ రెడ్డి చొరవ.. దాతల సహకరంతో కరోనా వైద్య సేవలు
X

దిశ, కంటోన్మెంట్: సామాజిక సేవ దృక్పథం.. సంకల్పబలం ఉంటే సాధించలేనిదంటూ నిరూపించాడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి. తన నియోజకవర్గం పరిధిలోని బొల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రి(సీజెహెచ్)ని పూర్తి స్థాయి కొవిడ్ కేంద్రంగా తీర్చిదిద్దాడు. నిధుల లేమికి తోడు నిర్వహణ లోపంతో ఐదేళ్లుగా కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పూర్తిస్థాయి కరోనా సేవలను అందించేలా తీర్చిదిద్దాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకున్నా.. తన ఎంపీ నిధులతోపాటు దాతల సహకారంతో ఉచితంగా కరోనా సేవలను అందించేందుకు 50 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయించారు.

ఐదేళ్లుగా నామమాత్రపు సేవలకే..

బొల్లారంలో కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని అత్యాధునిక హంగులతో ఐదేళ్ల క్రితం నిర్మించారు.రూ.4.5 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని నాటి కేంద్ర రక్షణ మంత్రి మనోహార్ పారికర్ ప్రారంభించారు. ఆసుపత్రిలో 24 గంటలపాటు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని ప్రకటించారు. ఆసుపత్రినైతే నిర్మించారు కానీ..నిర్వహణ కష్టతరంగా మారింది.గతం (పాత ఆసుపత్రి భవనం)లో 24 గంటలపాటు మెరుగైన సేవలందించిన ఆసుపత్రి ఉదయంపూట ఔట్ పేషంట్లకు సేవలందించేందుకే పరిమితమైంది. దీంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు పలుమార్లు ఆసుపత్రి కోసం నిధులను కేటాయించాలని బోర్డు సమావేశంలో కోరినా.. నిధుల లేమి వల్ల కేటాయింపులు జరగలేదు. దీంతో స్థానిక బోర్డు సభ్యులు ఈ సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి, రాష్ట్ర సర్కార్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల కేటీఆర్ నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ లను ఆసుపత్రికి పంపి, సాధ్య సాధ్యాలను పరిశీలించాలని సూచించారు. దీంతో పూర్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులిద్దరు లక్ష్మారెడ్డి,ఈటల రాజేందర్ లతోపాటు, ఉన్నత అధికారులు సందర్శించి ఆసుపత్రిని తమకు అప్పగించాలని కోరారు. అయితే అందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ పేచి పెట్టడడంతో రాష్ట్ర సర్కారు ఆసుపత్రి నిర్వహణకు ఒక్క పైసా కూడా నిధులను కేటాయించలేదు. అయితే కంటోన్మెంట్ బోర్డు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పలుమార్లు సమావేశమై చర్చించినా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి తోడు ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తన మల్లారెడ్డి ఆసుపత్రి సహకారంతో బొల్లారంలో 24 గంటలపాటు వైద్య సేవలందిస్తానని ప్రకటించినా..ఒక్క అడుగు ముందుకు పడలేదు.

ఎంపీ ప్రోత్సాహంతో..

కరోనా కష్టకాలంలో సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సహాం లేకుండానే బొల్లారం ఆసుపత్రిని కొవిడ్ కేంద్రంగా తీర్చిదిద్దాడు.తన ఎంపీ నిధులను నుంచి కోటి రూపాయాలను కేటాయించారు. తన స్నేహితులు, దాతల సహయంతో 50 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయించారు.ఎంపీ సంకల్పానికి కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్ రెడ్డిలు సహకారం తోడైంది.దీంతో ఆసుపత్రిలో కొవిడ్ వైద్య సేవల కోసం ప్రత్యేకంగా 35 పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేశారు.ఒక సీనియర్ జనరల్ ఫిజీషియన్ తోపాటు ఐదుగురు డ్యూటీ డాక్టర్లను నియమించారు. వీరితోపాటు ఇద్దరు నర్సింగ్ సూపర్ వైజర్ లు, 20 మంది నర్సులు,ముగ్గురు పార్మాసిస్ట్ లు, ముగ్గురు ప్లెటోటోమిస్ట్ లును త్వరితగతిని ఎంపిక చేసుకొని పూర్తి స్థాయి కొవిడ్ సేవలకు కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని సిద్దం చేశారు.ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది కరోనా పేషంట్లు చికిత్స పొందుతున్నారు. మరో 41 బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆసుపత్రి యజమాన్యం తెలిపింది. ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పనిని..కేవలం ఒక్క ఎంపీ చేయడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.



Next Story

Most Viewed