అలవెన్స్ లేకుండా రిస్క్ డ్యూటీ

by  |
అలవెన్స్ లేకుండా రిస్క్ డ్యూటీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19తో బాధపడుతూ మృత్యువుతో పోరాడిన ల్యాబ్ టెక్నిషియన్ గోవర్ధన్ మృతి వైద్య సిబ్బందిని కలవరపెడుతోంది. ఆయన చెస్ట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా చేస్తూ కొంతకాలంగా కరోనా రోగులకు స్క్వాబ్ తీయడంలో కీలకంగా పని చేశారు. 14రోజులుగా కరోనాతో పోరాడి శనివారం తెల్లవారుజామున మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లకు పాజిటివ్ అని తేలింది. ఇద్దరు ఇదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. దీంతో వాళ్లతో పరీక్ష చేయించుకున్న వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఆ ల్యాబ్ టెక్నిషియన్లు పెద్ద సంఖ్యలో స్వ్యాబ్ సేకరించారు. ఈ క్రమంలో ఎంత మందికి ముప్పు వాటిల్లిందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. 4 నెలలుగా ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నామని, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులకు హాజరవుతున్నామని ల్యాబ్ టెక్నిషియన్లు వాపోతున్నారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం తమ విధులు కాకపోయినా తామే స్వ్యాబ్ సేకరిస్తుండడం వల్లే ప్రాణాలు పోతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, నిమ్స్, చెస్ట్ ఆసుపత్రి సిబ్బంది కరోనా యుద్ధంలో ముందు వరుసలో ఉన్నారు. ల్యాబ్ టెక్నిషియన్లు, ఎక్స్‌రే, ఈసీజీ టెక్నిషియన్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు కరోనా బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. దానికి అవసరమైన సదుపాయాలను, మెటీరియల్‌ను కల్పించాలని కోరుతున్నారు.

రక్షణ చర్యలు అనివార్యం

– సాధారణ చికిత్సల కోసం వచ్చే వారిని నియంత్రించాలి.
– ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని ఆస్పత్రికి రావాలి.
– ఎమర్జెన్సీలో మాత్రమే ఆసుపత్రికి రావాలి. రోగి వెంట ఒక్కరే ఉండాలి. విధిగా మాస్క్ లు ధరించాలి.
– ప్రైవేట్ ఆస్పత్రులు పూర్తి స్థాయిలో సేవలు అందించక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ పెరుగుతుంది. ఔట్ పేషంట్ విభాగాల్లో రద్దీ మూలాన వైరస్ విజృంభిస్తోంది. దాంతో పలువురు డాక్టర్లు, సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు.
– పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ పూర్తి జాగ్రతలు తీసుకోవాలి.
– వారికి పూర్తి స్థాయి పీపీఈ కిట్లను ప్రభుత్వం అందించాలి.
– ప్రభుత్వం వైద్య, పారామెడికల్, నర్సింగ్ సిబ్బందిని రెండు బృందాలుగా విభజించి ఒక్కో బృందంతో సేవలు అందిస్తూ మరో బృందాన్ని క్వారంటైన్‌లో ఉంచాలి.
– ప్రజల్లో లక్షణాలు కనిపించకున్నా వైరస్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులను పాజిటివ్ వ్యక్తి గానే భావించి మూడు సూచనలు పాటించాలి. అందుకే భౌతిక దూరం పాటించాలి. అత్యవసరం అనుకుంటే బయటికి రావాలి. తక్కువ టైమ్ ఇంటి బయట గడపాలి. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి.
– స్వయ రక్షణే కరోనా నుంచి కాపాడుతుందని నిమ్స్ పారా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ స్పష్టం చేస్తోంది.

ప్రతి పని చేస్తున్నాం: మంచాల రవీందర్, ప్రధాన కార్యదర్శి, ల్యాబ్ టెక్నిషియన్ల సంఘం

కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోన్న వారిలో మేం ముందు వరుసలో ఉన్నాం. ప్రతి పని చేస్తున్నాం. ప్రెగ్నెంట్స్ మహిళలకు కూడా పరీక్షలు చేస్తున్నాం. టీబీ స్క్రీనింగ్, పెద్దలకు వైద్య పరీక్షలు.. ఆఖరికి జనరల్ ఓపీలోనూ ఉన్నాం. టీబీ స్క్రీనింగ్‌లో పీపీఓ కిట్లు ఇవ్వడం లేదు. ఎన్-95 మాస్కులు కూడా పంపిణీ చేయట్లేదు. మల్టీ డైమెన్షల్ పనులు చేస్తున్నాం. సైంటిఫిక్ నేచర్ వర్క్ చేపట్టాం. ప్రజారోగ్యంలో మేం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్‌కు వెన్నెముకగా పని చేస్తున్నాం. ఇకనైనా మాకు రిస్క్ అలవెన్స్ నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. అది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇవ్వాలని కోరుతున్నాం. ల్యాబ్ టెక్నిషియన్లందరికీ క్వారంటైన్ లీవ్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాం.

Next Story