సచివాలయంలో కరోనా కలకలం..

by  |
సచివాలయంలో కరోనా కలకలం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు చివరకు సచివాలయాన్నీ తాకాయి. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌లో పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సహ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పాజిటివ్ అని స్పష్టంగా తెలిసినప్పటికీ దాన్ని గోప్యంగా ఉంచిన కొద్దిమంది సిబ్బంది యధావిధిగా ఆఫీసుకు వచ్చినట్లు మంగళవారం ఉదయం పలువురు ఉద్యోగులకు అనుమానమొచ్చింది. వారం రోజుల నుంచి కొద్దిమంది ఉద్యోగులు ఆఫీసుకు రాకుండా వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండడంతో ఈ అనుమానం మరింత బలపడింది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాము కూడా వర్క్ ఫ్రం హోమ్ చేస్తామని కొద్దిమంది ఉద్యోగులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. పాజిటివ్ కేసులు ఉన్నాయని, అయినా యధావిధిగా ఒకరిద్దరు ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారని, దీని కారణంగా తమకు అంటుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారుల దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇలా మొరపెట్టుకున్నవారు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కావడంతో ఉన్నతాధికారులు సానుకూలంగా రెస్పాండ్ కాలేదని, యధావిధిగా ఆఫీసుకు రావాల్సిందేనంటూ ఆదేశించారు. దీంతో కరోనా భయంతో ఇటు ఆఫీసులో మనస్ఫూర్తిగా పనిచేయలేక అటు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో అనుమతి లభించక ఇబ్బంది పడుతున్నారు.

Next Story

Most Viewed