వరల్డ్‌లో న్యూజిలాండ్.. ఇండియాలో ‘డామన్ డయ్యూ’

by  |
వరల్డ్‌లో న్యూజిలాండ్.. ఇండియాలో ‘డామన్ డయ్యూ’
X

ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులెన్ని? ఎంతమంది చనిపోయారు? మొత్తం ఎన్ని కేసులు?.. ఇలాంటి లెక్కలన్నీ చూస్తూ రోజురోజుకూ మనుషుల్లో ఆశావహ దృక్పథం క్షీణిస్తోంది. అయితే ప్రపంచంలో ఏదో ఒక మూలన రోజుకో దేశం కరోనా ఫ్రీ దేశంగా మారుతుండటం సానుకూలాంశం. మొన్న ఫిజీ దేశం కరోనా ఫ్రీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా న్యూజిలాండ్ కూడా తమది ‘కరోనా ఫ్రీ’ దేశంగా ప్రకటించుకుంది. మన దేశంలోనూ కేంద్రపాలిత ప్రాంతం ‘డామన్ డయ్యూ’ కూడా కరోనా ఫ్రీగా మారడం విశేషం.

తమ చిట్టచివరి కొవిడ్19 పేషెంటును సోమవారం ఐసోలేషన్ నుంచి విడుదల చేసిన తర్వాత న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ యాష్లీ బ్లూమ్‌ఫీల్డ్.. తమ దేశం ‘కరోనా ఫ్రీ’ అని ప్రకటించారు. ఫిబ్రవరి 28న న్యూజిలాండ్‌లో మొదటి కరోనా కేసు నమోదైంది. కాగా ప్రస్తుతం కరోనా ఫ్రీ అయినప్పటికీ ప్రాథమిక నిబంధనలు కొనసాగుతాయని యాష్లీ స్పష్టం చేశారు. ఏడు వారాల పాటు కఠిన లాక్‌డౌన్ పాటించడం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. మొత్తం 50 లక్షల మంది జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో మొత్తంగా 1,154 కేసులు నమోదు కాగా, 22 మంది చనిపోయారు. గత 17 రోజులుగా ఆ దేశంలో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా కట్టడి కోసం ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ అనుసరించిన ‘నాలుగు అంచెల వైరస్ స్పందన వ్యవస్థ’ విజయవంతమైందని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇక మన దేశంలోనూ డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా ఎలాంటి కరోనా కేసు నమోదు కాలేదు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయడం, సడలింపుల్లో కూడా క్రమశిక్షణ పాటించడంతో పాటు కరోనా వారియర్స్ చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆ జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. భూభాగరీత్యా కరోనాతో విలవిల్లాడుతున్న గుజరాత్, మహారాష్ట్రలకు చేరువలో ఉన్నప్పటికీ ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించడం వల్లే కేసులు జీరోకు చేరాయని అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ అన్నారు. 75 రోజుల పాటు ఇంటి నుంచే పనిచేసిన ఉద్యోగులకు, పూర్తి నిబద్ధతతో లాక్‌డౌన్ పాటించిన ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed