జీహెచ్ఎంసీ, సచివాలయ ఉద్యోగులకు కరోనా

by  |
జీహెచ్ఎంసీ, సచివాలయ ఉద్యోగులకు కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ ఇప్పుడు ప్రభుత్వాఫీసులకూ పాకింది. రెండు రోజుల క్రితం బేగంపేట్ మెట్రో రైల్ ఆఫీసులో పనిచేస్తున్న సీఎంఓ బ్లాకుల్లోని ఉద్యోగికి కరోనా సోకగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కూ, తాత్కాలిక సచివాలయమైన బీఆర్‌కేఆర్ భవన్‌కూ పాకింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని నాల్గవ అంతస్తులో ఉన్న హెల్త్ సెక్షన్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ సెక్షన్‌లోని ఉద్యోగులందరినీ ఖాళీ చేయించారు. ప్రస్తుతం క్రిమి సంహారక మందులతో శుభ్రం చేసే పని మొదలైంది. తాత్కాలికంగా ఆ ఉద్యోగులను ఆ బ్లాక్‌లోంచి ఖాళీ చేయించి ఇళ్లకు పంపించేశారు. రెండు మూడు రోజుల వరకు ఇళ్లకే పరిమితం కావాలంటూ మౌఖిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. పలు అంతస్తుల్లో ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సుమారు రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటైజర్ల లాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

మరోవైపు తాత్కాలిక సచివాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి కూడా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బీఆర్‌కేఆర్ భవన్‌లోని ఏడవ అంతస్తులో ఉన్న ఆర్థికశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఎనిమిదో అంతస్తులో పనిచేసే కొందరు ఆర్థిక శాఖ ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. ఇటీవలి కాలంలో ఢిల్లీలోని పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులకు, అధికారులకు పాజిటివ్ రావడంతో రెండు మూడు రోజులపాటు మూసివేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సంయుక్త భవన్‌లో సైతం ఉన్నతాధికారి ఒకరికి పాజిటివ్ రావడంతో మంగళవారం వరకూ సెలవులు ఇవ్వాల్సి వచ్చింది.

నివాస ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకుతున్నందున ప్రత్యామ్నాయం ఏంటో తెలియక గందరగోళంలో పడ్డారు. సహజీవనం సంగతి సరేగానీ ఆఫీసుల నుంచి ఇళ్ల దాకా వైరస్ పాకితే కుటుంబ సభ్యులకు ఏమవుతుందోననే ఆందోళనే ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తోంది.

Next Story

Most Viewed