ఆబ్కారీని చుట్టుముట్టిన కరోనా ​

by  |
Corona for Excise Department employees
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆబ్కారీ పోలీసుల్లో కరోనా భయం పట్టుకుంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. శాఖలోని ఫీల్డ్​ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులకు కరోనా పాజిటివ్​ వస్తుండటంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్సైజ్​ శాఖలోని ఓ ఎస్సై పరిస్థితి విషమంగా మారింది.

రాష్ట్రంలో గుడుంబా అరికట్టడం, సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణాపై ఆబ్కారీ పోలీసులు తనిఖీలు చేస్తునే ఉన్నారు. దీనికి తోడుగా పలు జిల్లాల్లో ఎన్నికలు ఉండటంతో తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్​ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారుల వరకూ కరోనా పాజిటివ్​ తేలుతోంది. హైదరాబాద్​ శివారులోని ఓ ఎక్సైజ్​ అసిస్టెంట్​ సూపరింటెండెంట్​తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సీఐలు, ఎస్సైలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. దీంతో ఇప్పుడు విధుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.

మరోవైపు ఆబ్కారీ భవన్​లో కూడా కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు కార్యాలయాలకు రావడం లేదు. కానీ కిందిస్థాయిలో మాత్రం తనిఖీలు ఆపవద్దంటూ ఆదేశాలిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఆబ్కారీ శాఖలోని కరోనా పాజిటివ్​ వచ్చిన వారిలో కొంతమంది హోం ఐసోలేషన్​లో ఉన్నా… పలువురు మాత్రం ఆస్పత్రుల్లో చేరారు. ఒక ఎస్సైతో సహా పలువురి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పుతున్నారు.



Next Story