కరోనా భయం ఉరుకులు పరుగులు

by  |
కరోనా భయం ఉరుకులు పరుగులు
X

తెలుగు రాష్ట్రాలను కరోనా భయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్క రోజు జనతా కర్ఫ్యూ తరువాతి పరిణామాలు అందర్లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో హైదరాబాదులోని స్థానికేతరులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల ప్రజలు అవకాశా కోసం హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు పోటెత్తారు.

బైక్‌లు, కార్లు బయటకి తీశారు. మరికొందరు ఓలా, ఉబర్‌లను నమ్ముకున్నారు. ఊర్లకు బయల్దేరిన వాహనదారులు హైదరాబాదు దాటేందుకు నానా యాతన పడ్డారు. హైదరాబాదులో ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో వాహనదారులు కష్టంతో ఊరు దాటారు. శివార్లలో వాహనాలు ఎక్కేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు.

శివార్లు దాటిన అనంతరం అంతర్రాష్ట్ర సరిహద్దులైన కోదాడ, పెబ్బేరు, భద్రాచలం, నాగార్జున సాగర్, జహీరాబాద్ చెక్ పోస్టుల దగ్గర అడ్డుకుంటున్నారు. వాహనాలను నిలిపివేయడంతో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే వాహనాలను నిలపేశారు. దీంతో కోదాడ వద్ద సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పలువురు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కాగా, పాలు, కూరగాయలు, మందులకు సంబంధించిన అత్యవసర వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని, అలాంటి వాటినే రాష్ట్రం నుంచి బయటకు వెళ్లనిస్తామని పోలీసు అధికారులు తేల్చి చెబుతున్నారు. చెక్ పోస్టుల వద్ద హెల్త్, పోలీస్, రవాణాశాఖ సిబ్బంది మూడు షిఫ్ట్‌ లలో పని చేస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నెలాఖరు వరకూ లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని సూచిస్తున్నారు.

Tags: ap, telangana, check post, kodada, vehicles stop, lockdown,



Next Story

Most Viewed