పయిలం సుమా!

by  |
పయిలం సుమా!
X

దిశ, న్యూస్ బ్యూరో: ఏందో ఏమో అర్థమే కాదు.. కనబడుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. మొదట బాగానే స్పీచ్ ఇచ్చారు కానీ, ఆ పనిలో మాత్రం తేడా చూపిస్తున్నారు. ఆ నిర్లక్ష ధోరణేందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇదేందంటూ జనం తీవ్రంగా మండిపడుతున్నారు. అదేంటో మీరే చూడండి.. ప్రత్యేక స్టోరీలో..

ప్రపంచమంతా కరోనా భయాలతో తగిన జాగ్రతలు తీసుకుంటుంది. మన ప్రభుత్వం కూడా వైరస్ నివారణ చర్యలు చేపడుతున్నామని ప్రకటించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 200 మందిని వైద్య సిబ్బందిని కూడా నియమించింది. అయితే నగరంలో ఎక్కువ మంది ప్రయాణించే మెట్రో, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి రావాలంటే ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్.. ఈ మూడింటిలో ప్రతీ నిత్యం 15 నుంచి 30 లక్షల మంది ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే.. ఇంత ప్రాధాన్యత ఉన్న వ్యవస్థల్లో ప్రభుత్వం, అధికారులు ప్రస్తుతం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రస్తుతం స్ఫష్టంగా కనిపిస్తోంది.

మెట్రో కార్మికులపై నిర్లక్ష వైఖరి

రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసు బయటపడగానే మెట్రో అధికారులు.. మెట్రో స్టేషన్లు, రైళ్లను ప్రతీరోజు శుభ్రం చేస్తున్నారు. అయితే ఈ పనిలో నిమగ్నమయ్యే మెట్రోలో పనిచేసే సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజులు ఇస్తున్నామని మెట్రో అధికారులు ప్రకటించారు. మొదటి వారం రోజులు సరిగానే ఇచ్చినా ఇప్పుడు మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదు. వాటిని మీరే కొనుగోలు చేసుకోవాలంటూ కాంట్రాక్టు ఏజెన్సీలు ఆ సిబ్బందికి సూచిస్తున్నాయి. అయితే.. మెట్రో సెక్యూరిటీ విభాగంలోనే 700 మందికి పైగా పనిచేస్తుంటారు. టికెటింగ్, స్టేషన్ మేనేజర్లు, క్లీనింగ్ సిబ్బంది కలిపి వేల మంది ఉంటారు. నిత్యం నాలుగు లక్షల మందికి పైగా ప్రయాణించే మెట్రోలో ఇప్పుడు కరోనా భయాలతో కొంత రద్దీ తగ్గింది. ఒక్కో రైల్లో 500 మందికి పైగానే ప్రయాణిస్తుండగా.. 700 పైగా సర్వీసులను మెట్రో నడిపిస్తోంది. లక్షల మంది ప్రయాణించే ఏసీ మెట్రోలో కరోనా వస్తే ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మెట్రోల్లో పనిచేసే సిబ్బంది ఎంత ప్రమాదకరస్థితిలో పనిచేస్తున్నారో మెట్రో అధికారులకు అర్థం కావడం లేదేమోననే సందేహాలు రాకమానదు. మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించేవారిని పరీక్షించేవిధానం గానీ, మాస్క్ లు ఇచ్చే వ్యవస్థ కూడా ఎక్కడా కనిపించడంలేదు. రూ.5 కూడా విలువ చేయని మాస్క్ లను సొంత సిబ్బందికే ఇవ్వలేని మెట్రో ఇగ ప్రజల ప్రాణాలకు విలువనిస్తుందని ఆశించడం కూడా ప్రశ్నార్థకమే అని అనిపిస్తోంది. కనీసం మెట్రో స్టేషన్లలో, రైళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు చర్యలపైనా అవగాహన కల్పించేలా ప్రకటనలు ఇచ్చినా.. ప్రజలు తమ సొంత ఏర్పాట్లను చేసుకుంటారు కదా.. ప్రైవేటు కంపెనీలు, టీవీ ఛానెళ్ల నుంచి వచ్చే ఆదాయంపైనా పెట్టే దృష్టి మెట్రో సిబ్బంది, ప్రజలపైనా పెడితే బాగుంటుందని మెట్రో ప్రయాణీకులు వాపోతున్నారు.

ప్రధాన బస్ స్టేషన్లలో పట్టింపు లేదు

కరోనా భయాలు, సెలవుల కారణంగా ఆర్టీసీ సర్వీసుల్లోనూ, ప్రయాణీకుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రధాన బస్ స్టాండ్లలో థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే అలాంటివేమీ నగరంలో కనిపించడం లేదు. ప్రతీ నిత్యం 3,500 సర్వీసుల ద్వారా 50-60 వేల మంది ప్రజలు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ప్రయాణిస్తుంటారు. ఇక్కడ కూడా కరోనాకు సంబంధించిన వాల్ పోస్టర్లు తప్ప మైకుల్లో చెప్పి అవగాహన కల్పించే వ్యవస్థ ఏదీ లేదు. మాస్క్ లు ఇచ్చేవారు గానీ, అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు వైద్య సిబ్బంది గానీ అందుబాటులో లేరు. టాయిలెట్లు, వాష్ బేషిన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేకంగా సిబ్బంది లేరు. అక్కడ హ్యాండ్ వాష్ చేసే లిక్విడ్స్ గానీ అందుబాటులో లేవు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లోనైతే రాకపోకలు సాగించే సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అక్కడకొచ్చే ఆటోలు, ట్యాక్సీలు, కార్లు.. వీటన్నిటిని ఒకేసారి నియంత్రించడం అంతా సాధారణ విషయమూ కాదు.. కనీసం మాస్క్, కర్చీఫ్ ధరించి బయటకు రావాలని, జనాల్లో ఉన్నపుడు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాప్తి, నివారణపై మైక్ ల ద్వారా అవగాహన కల్పిస్తే వచ్చే ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు అవకాశం ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రయంలో రెండొందల మందిని నియమించిన ప్రభుత్వం.. ప్రధాన బస్ స్టేషన్లలో అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మెట్రో అధికారులు స్పందించి సిబ్బందికి కరోనా నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

Tags : metro, mgbs, jbs, corona, KCR



Next Story

Most Viewed