కరోనా డెత్​ ‘సమ్మరీ’ చిక్కులు..!

by  |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో మృతి చెందిన బాధితులకు డెత్​ సమ్మరీ(సారంశం) చిక్కులు ఏర్పడుతున్నాయి. ఇన్సురెన్స్​​(భీమా) క్లైమ్ చేసుకునేందుకు మృతుల కుటుంబ సభ్యులు డెత్​ సమ్మరీని కోరుతున్నా, కొన్ని ఆసుపత్రులు ఇవ్వడం లేదని సమాచారం. ప్రతీ రోజు వైద్యారోగ్యశాఖకు సుమారు 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తున్నట్లు స్వయంగా హెల్త్​ ఆఫీసర్లే పేర్కొంటున్నారు. గత నాలుగైదు రోజుల​ నుంచి మాత్రమే 104 కాల్​ సెంటర్​కు ఇలాంటి కంప్లైట్స్​ వస్తున్నట్లు వైద్యశాఖ వివరించింది. వీటిలో సర్కార్​ దవాఖాన్లు కూడా ఉండటం గమనార్హం. దీంతో కరోనా డెత్​కు సంబంధించిన పత్రాలు ఇవ్వని ప్రైవేట్​ ఆసుపత్రులకు వైద్యశాఖ నోటీసులు జారీ చేయనున్నది.

ఇప్పటికే ఆయా ఆసుపత్రుల జాబితాను కూడా సిద్ధం చేసినట్టు వైద్యారోగ్యశాఖలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఒకటి రెండ్రోజుల్లో సదరు ఆసుపత్రులకు నోటీసులు వెళ్లనున్నాయి. అంతేగాక సర్కార్​ దవాఖాన్లలో ఇవ్వకపోవడానికి గల కారణాలను వెల్లడించాల్సిందిగా సంబంధిత అధికారులకూ సూచించనుంది. దీంతో పాటు అన్ని ఆసుపత్రుల్లో కరోనా మృతుల వివరాలను అప్టేట్​ చేయాలని సర్కార్​ ఆదేశాలు జారీ చేయనుంది.

ఆ ‘పత్రం’ తప్పనిసరి…

మరణించిన తర్వాత హెల్త్​, ఇతర ఇన్సురెన్స్​ లను క్లైమ్​ చేసుకోవాలంటే సదరు వ్యక్తి మృతికి స్పష్టమైన కారణాన్ని తెలియజేసేలా డాక్టర్​ నుంచి ధృవీకరణ పత్రం తప్పనిసరి. బాధితుడికి చికిత్సను అందించిన హాస్పిటల్స్​ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుడు ఏ కారణంతో చనిపోయారు? సకాలంలో వైద్యం పొందాడా? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? మరణించిన తేదీ, సమయం, పూర్తి అడ్రస్​, వంటి వివరాలను ఆ పత్రంలో పొందుపరచాలి. ఇవన్నీ ఉంటేనే ఇన్సురెన్స్​ కంపెనీలు భీమాను క్లైమ్​ చేసుకునేందుకు వెసులుబాటును కల్పిస్తాయి. కానీ కొన్ని ఆసుపత్రులు డెత్​ సమ్మరీలు ఇవ్వకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఆసుపత్రులు, అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందంటున్నారు. ఇక కో మార్పిడ్​ కండీషన్​ కేటగిరికి చెందిన వ్యక్తులకైతే మరింత సమస్యగా మారింది. డెత్​ గైడ్​లైన్స్​ ప్రకారం ఏ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే, ఆ మరణంగా పేర్కొనాలంటూ గతంలో ఐసీఎంఆర్​ విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సర్కార్​ కూడా ఇదే విధానాన్ని అవలంభించింది. అంటే కరోనా సోకి హార్ట్​ సమస్య ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ డెత్​ ను ఇప్పటి వరకు సర్కార్​ హార్ట్​ ఇష్యుగానే పరిగణించింది.

ఈ క్రమంలో కరోనా హెల్త్​ ఇన్సురెన్స్​ ఉన్నోళ్లు ఆ సమ్మరీతో క్లైమ్​ చేసుకునేందుకు అర్హులు కారు. దీంతో హార్ట్​, కీడ్నీ, లివర్, వంటి సమస్యలున్నోళ్లకు కరోనా సోకి చనిపోతే, డెత్​ సమ్మరీ ఇచ్చేందుకు కష్టంగా మారిందని స్వయంగా డాక్టర్లు చెబుతున్నారు. చిన్నపొరపాటు జరిగినా ఇటు సర్కార్​ నుంచి, బాధితుల నుంచి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

కేంద్ర ప్రకటనతో సర్టిఫికేట్ల లొల్లి…

కరోనా కారణంగా మృతి చెందిన ప్రతీ ఒక్కరికీ తలా రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. దీంతో చాలా మంది కరోనా డెత్​ సర్టిఫికేట్లను పొందేందుకు ఆసుపత్రులు చుట్టు తిరుగుతున్నారు. గతంలో తమ సమ్మరీల్లో కరోనా డెత్​ గా రాయవద్దన్నోళ్లు కూడా ఇప్పుడు ఎంట్రీ చేయాలని కోరుతుండటం విశేషం. ప్రైవేట్​ ఆసుపత్రులకు ఎక్కువ మంది వెళ్తున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రైవేట్​ ఆసుపత్రుల్లో ఇది పెద్ద దందాగా మారే ప్రమాదమూ లేకపోలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం చనిపోయిన వారి కేస్ హిస్టరీ షీట్ ఆధారంగా డెత్ సర్టిఫికెట్లలో మార్పుల కోసం మళ్ళీ డాక్టర్లను సంప్రదించే అవకాశమూ లేదంటున్నారు. ఇది ఆస్పత్రి వర్గాలతో బాధితుల కుటుంబాలకు సరికొత్త ఘర్షణలకు, వాదనలకు దారితీసే అవకాశం ఉందని ఆఫీసర్లు ఆప్​ ది రికార్డులో ఒప్పుకుంటున్నారు.



Next Story

Most Viewed