‘టిమ్స్‌’ వార్డుల్లో పేషెంట్లు.. కారిడార్‌లో శవాలు

by  |
‘టిమ్స్‌’ వార్డుల్లో పేషెంట్లు.. కారిడార్‌లో శవాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లుగానే మృతిచెందుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలోనే కాక గచ్చిబౌలిలోని ‘టిమ్స్’ ఆస్పత్రిలోనూ వందలాది మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వ్యాధి నయం కాక చనిపోతున్నవారి సంఖ్య కూడా ‘టిమ్స్’లో ఎక్కువగానే ఉంది. పేషెంట్లు వార్డుల్లో ఉంటే మృతదేహాలు కారిడార్‌లో స్ట్రెచర్‌ల మీద, బెడ్‌ల మీద దర్శనమిస్తున్నాయి. చికిత్స విఫలమై శుక్రవారం ఒక్క రోజే దాదాపు 30 మంది చనిపోయినట్లు సిబ్బంది పేర్కొన్నారు. కానీ ఆస్పత్రిలో మార్చురీ లేకపోవడంతో ఆ మృతదేహాలన్నీ ఒక్కో ప్లోర్‌లోని కారిడార్‌లలో పెట్టక తప్పలేదు. మృతుల బంధువులకు బాడీని అప్పజెప్పడం కోసం మరో మార్గం లేక ఎక్కడికక్కడ బారులు తీరి స్ట్రెచర్ల మీద పడి ఉన్నాయి.

రాష్ట్రం మొత్తం మీద కరోనా కారణంగా 33 మంది చనిపోయినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొన్నా ఒక్క గచ్చిబౌలి ‘టిమ్స్‘ ఆస్పత్రిలోనే 30 మంది చనిపోయినట్లు సిబ్బంది చెప్తున్నా లెక్కల్లో మాత్రం కనిపించడంలేదు. ఇక గాంధీ ఆస్పత్రిలో చనిపోయినవారి లెక్కలు బయట ప్రపంచానికే తెలియడంలేదు. ‘టిమ్స్’ ఆస్పత్రిలో మార్చురీ లేకపోవడంతో డెడ్ బాడీలను వీలైనంత తొందరగా కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు సిబ్బంది. ఆ ప్రక్రియ ముగిసేంత వరకూ బాడీలన్నీ కారిడార్‌లలో స్ట్రెచర్‌లు, బెడ్‌లకే పరిమితమవుతున్నాయి.

ఆక్సిజన్ సరిపోకనే మరణాలు?

‘టిమ్స్’ ఆస్పత్రిలో ఎనిమిది ఫ్లోర్లలో కరోనా పేషెంట్లను ఆయా వార్డుల్లో చేరుస్తున్నారు. ప్రతీ ఫ్లోర్‌లో మూడు విభాగాలుగా బెడ్‌లను నిర్వాహకులు ఏర్పాటుచేశారు. అయితే మొదటి మూడు ఫ్లోర్లకు మాత్రమే పేషెంట్ల అవసరాలకు సరిపోయేంత ప్రెషర్‌లో ఆక్సిజన్ అందుతోందని, ఆ పై ఫ్లోర్లలోని వార్డుల్లో తక్కువ ప్రెషర్‌తో ఆక్సిజన్ సరఫరా అవుతున్నందువల్ల పేషెంట్లకు ఇబ్బంది కలుగుతున్నట్లు ఆస్పత్రి వైద్య సిబ్బంది ఒకరు వివరించారు. ఎనిమిదో ఫ్లోర్ తర్వాత అంతస్తుల్లో ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు లేనందువల్ల పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడంలేదని పేర్కొన్నారు. అందువల్ల ఆ ఫ్లోర్లన్నీ నిరుపయోగంగానే ఉండిపోయాయి.

Next Story

Most Viewed