మావోయిస్టులపై కరోనా కాటు

by  |
మావోయిస్టులపై కరోనా కాటు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.. మావోయిస్టులపై కరోనా కాటు వేస్తోంది.. కరోనా సెకండ్ వేవ్లో వైరస్ సోకటంతో అడవుల్లో ఉండలేక.. ఆస్పత్రికి వెళ్లలేక సతమవుతున్నారు.. చికిత్సకు బయటకు వస్తున్న మావోయిస్టులు పోలీసులకు చిక్కుతున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి మధుకర్ కరోనా చికిత్స కోసం వచ్చి పోలీసులకు చిక్కగా.. తాజాగా హైదరాబాదులో కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినవారుకాగా.. మృతదేహానికి స్వస్థలం బెజ్జూరు మండలం కొండపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గడ్డ మధుకర్ స్వస్థలం కొండపల్లి నిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ ఆలియాస్ మోహన్ ఆలియాస్ శోబ్రాయ్ ను జూన్ 2న మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కొండపల్లి గ్రామం. అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1999లో సిర్పూర్ దళంలో చేరాడు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. తర్వాత పార్టీ ఆదేశాల మేరకు గడ్డం మధుకర్ 2000వ సంవత్సరంలో దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి బదిలీ అయ్యారు. అప్పటినుండి మావోయిస్టు పార్టీ కేంద్ర విభాగాని చెందిన అగ్రనాయకులు నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు, పుల్లూరి ప్రసాద్ రావు ఆలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవోజీ, యాప నారయణ ఆలియాస్ హరిభూషణ్ మరియు హిడుమ ఆదేశాల మేరకు ఛత్తీస్ ఘడ్ పలు విధ్వంసకర సంఘటల్లో పాల్గొనటంతో పాటు పలు మంది పోలీసులను హత్య చేసి వారి అయుధాలను అపహరించడంలో దుర్గం మధుకర్ నిందితుడు.

కరోనా సోకి.. పోలీసులకు చిక్కి..

కరోనా సెకండ్ వేవ్లో మావోయిస్టులకు కూడా కరోనా సోకింది. కరోనా సోకిన మావోయిస్టులు అడవుల్లో ఉండలేక.. ఆస్పత్రికి వెళ్లలేక.. సతమతమవుతున్నారు. కరోనా సోకిన వారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వనం నుంచి జనంలోకి వస్తుండగా.. పోలీసులకు చిక్కుతున్నారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టు గడ్డం మధుకర్ కూడా అలాగే చిక్కారు. వెంకటాపురం అడవుల నుంచి ఓ మైనర్ కొరియర్ సాయంతో కారులో వరంగల్లులో చికిత్సకు వస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. కారు వెనుక భాగం పడుకోబెట్టి హన్మకొండకు తీసుకెళ్తుండగా.. జూన్ 2న ములుగు క్రాస్ రోడ్డు ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టు గడ్డం మధు, మైనర్ కొరియర్ చిక్కారు. కరోనా వల్ల చాలా నీరసంగా ఉండటంతో.. మావోయిస్టు గడ్డం మధుకర్ ను పోలీసులు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మృతదేహానికి స్వగ్రామం కొండపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఉమ్మడి జిల్లాలో మిగిలింది ఇరవై మంది..

ఇప్పటికే మావోయిస్టుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మావోయిస్టులు ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతంలో కదలికలు లేవు. ఇక మంచిర్యా, ఆసిఫాబాద్ జిల్లాల్లో కదలికలు ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చత్తీస్ఘడ్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండగా.. మన జిల్లాకు చెందిన వారంతా అక్కడే పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలో మాజీలను, ఆదివాసీ యువతను ఆకర్షించేందుకు భాస్కర్ అలియాస్ అడెల్లు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే భాస్కర్ కోసం గాలింపు, ఎదురు కాల్పులు జరుగగా.. ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా కరోనా కాటు వేస్తుండటంతో.. మావోయిస్టులు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంకా 21మంది మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. తాజాగా బెజ్జూర్ మండలం కొండపల్లికి చెందిన మధుకర్ కరోనాతో చనిపోవటం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బని చెప్పవచ్చు.



Next Story

Most Viewed