వరంగల్‌లో మూడు ప్రాంతాల్లో కార్డన్ ఆఫ్ !

by  |
వరంగల్‌లో మూడు ప్రాంతాల్లో కార్డన్ ఆఫ్ !
X

దిశ, వరంగల్: కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న వరంగల్ నగరంలోని మూడు కాలనీల్లో కార్డన్ ఆఫ్ ప్రకటించారు. సామాజిక దూరంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయొచ్చనే ఏకైక సూత్రంతో ఇప్పటికే జనమంతా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావట్లేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవడంతో 15 ప్రాంతాలను ఇదివరకే నో మూవ్ మెంట్ ఏరియాలుగా ప్రకటించి పోలీస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. లోపలివాళ్లు బయటకు, బయట వ్యక్తులు లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నో మూవ్ మెంట్‌గా ప్రకటించిన ఏరియాల్లోని మూడు కాలనీలు మండిబజార్, నిజంపుర, చార్‌బౌలిలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నందున కార్డన్ ఆఫ్ విధించి జనాలు గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిత్యవసర వస్తువుల కోసం మొబైల్ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చారు.

మొన్నటి వరకు ఒక్క కరోనా కేసులేని వరంగల్ మహానగరం ఢిల్లీ ఘటనతో ఒక్కసారిగా వార్లల్లోకెక్కింది. మర్కజ్ సభలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏకకాలంలో 21పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అంతేగాక ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు.? ఎంతమందితో సన్నిహితంగా ఉన్నారు అనే విషయాలను ఆరా తీశారు. సంబంధిత వ్యక్తులకు సైతం కరోనా పరీక్షలు నిర్వహించారు. సమీప ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఆయా నివాస ప్రాంతాలను గుర్తించి నో మూవ్ మెంట్ ఏరియాలుగా ప్రకటించారు. నిత్యావసర వస్తువులు సరాఫరా చేసేందుకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఆ ఏరియాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ రవీందర్, వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Tags: Corona Virus, Warangal, Three Areas of Cardon, 15 No Movements, Gandhi Hospital, Delhi Markaz, Collector, CP

Next Story

Most Viewed