నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది ఇలా చేస్తున్నారేంటి..?

by  |
నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది ఇలా చేస్తున్నారేంటి..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో వైరస్ ఉధృతి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ సిబ్బంది చెప్పా పెట్టకుండా డుమ్మా కొడుతున్నారు. వీరి కారణంగా ఇతర సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. ఒక్కరిద్దరు కాదు ఏకంగా 22 మంది అనధికారికంగా డుమ్మా కొడుతుండగా.. వీరిలో కొందరైతే నెలల తరబడి రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తరచూ గైర్హాజరు అవుతున్న కాంట్రాక్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అప్రమత్తమయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్ నారాయణరెడ్డికి నివేదిక పంపారు.

సదరు సిబ్బందికి మెమోలు ఇవ్వడం, వివరణ కోరడం, తొలగించడం, కొత్తవారిని తీసుకునేందుకు కలెక్టర్‌కు నివేదిక పంపినట్టు డా. ప్రతిమారాజ్ స్పష్టం చేశారు. కొవిడ్ మొదటి దశలో వైద్యులు విధులకు రాని ఘటనలు ఒకటి రెండు జరిగాయని.. ఇప్పుడు అటువంటి ఘటనలు చోటుచేసుకోవడం లేదని చెప్పారు. కాగా, కొవిడ్ మొదటి దశలో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఒక ఏడాదికి పని చేయడం కోసం 120 మంది స్టాఫ్ నర్సులు, సెకండ్ వేవ్ సమయంలో 3 నెలల కోసం మరో 27 మందిని కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు. వీరిలో అత్యథికంగా డుమ్మాలు కొడుతుండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed