వర్చువల్ కోర్టులే బెటర్

by  |
వర్చువల్ కోర్టులే బెటర్
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమసిపోయిన తర్వాత కూడా వర్చువల్ కోర్టుల విధానాన్ని కొనసాగించడమే ఉత్తమమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (Law and Justice) అభిప్రాయపడింది. గుర్తించిన కేటగిరీల కేసులను అన్ని పక్షాల అనుమతితో వర్చువల్ విధానంలో విచారించడమే మంచిదని తెలిపింది. డిజిటల్ జస్టిస్‌ తక్కువ వ్యయంతో వేగవంతమైన విచారణ సాధ్యమవుతుందని రాజ్యసభ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ప్యానెల్ పేర్కొంది.

వాంగ్మూలమిచ్చే సాక్షులు సురక్షితంగా ఉంటారని, సాంప్రదాయ కోర్టుల కంటే వర్చువల్ కోర్టులతో విచారణ వేగంగా సాగుతుందని తెలిపింది. పౌరులందరికీ అందుబాటులో ఉంటుందని వివరించింది. కొవిడ్ 19 ప్రభావాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు సమర్పించిన తొలి ప్యానెల్ రిపోర్టు ఇదే కావడం గమనార్హం. టెక్నాలజీ గేమ్ చేంజర్ అని, అడ్వకేట్లూ మారుతున్న కాలానుగుణంగా మారాలని సూచించింది. కోర్టు అంటే ప్లేస్ కాదని, సర్వీసు అని పేర్కొంటూ న్యాయస్థానాలూ కొత్త సాంకేతికతకు ద్వారాలు తెరవాలని పేర్కొంది. టీడీఎస్ఏటీ, ఐపీఏబీ, ఎన్‌సీఎల్ఏటీలాంటి అప్పెల్లేట్ ట్రిబ్యునళ్లు శాశ్వతంగా వర్చువల్ విధానాన్నే కొనసాగించాలని సూచించింది.

వర్చువల్ విధానంతో పలు సమస్యలున్నాయని బార్ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 50శాతం మంది న్యాయవాదుల దగ్గర ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేవని, టెక్నాలజీ అనుసరించే న్యాయవాదులకే ఇది ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే, వాదన సమయంలోనూ న్యాయమూర్తుల మనోస్థితి కనిపెట్టలేమని, వాదన సాగుతున్న దిశను మార్చడం కష్టమవుతుందని, వర్చువల్ కోర్టుల ద్వారా అడ్వకేట్లకు, న్యాయమూర్తులకు మానసిక ఒత్తిడి ఉంటుందని వివరించారు.

Next Story

Most Viewed