ఫీవర్ ​సర్వే కంటిన్యూ..

by  |
fever survey
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎంతమందికి జ్వరం వచ్చింది, గ్రామాలు, పట్టణాల్లో కరోనా పాజిటివ్ బాధితులు ఎంతమంది, ఎవరికి మెడికల్​ కిట్లు ఇచ్చారు, వారు ఎక్కడ ఉంటున్నారనే వివరాలన్నీ మళ్లీ మళ్లీ సర్వే చేయనున్నారు. ఒక విడుత సర్వే ముగియగానే.. రెండో విడుతలో మళ్లీ మొదట్నుంచీ వివరాలు సేకరించనున్నారు. అంతేకాకుండా కొవిడ్​ పేషెంట్ల కోసం గ్రామాల్లోనే క్వారంటైన్​ కేంద్రాలను ఏర్పాటుచేయాలని, ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలంటూ మరోసారి ఆదేశాలిచ్చారు. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని పంచాయతీకార్యదర్శులు, మున్సిపల్​ సిబ్బంది, పాలకవర్గాలతో కలెక్టర్లు జూమ్​ ఆప్ ద్వారా సమావేశం నిర్వహించారు. అంతకు ముందే సర్వేపై సంక్లిప్త సమాచారమిచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఫీవర్, గర్భిణీల సర్వే నిరంతరం చేయాలని ప్రభుత్వం అత్యవసర ఆదేశాలిచ్చింది. కరోనా కట్టడయ్యేంత వరకూ… ఒక రౌండ్​ ముగియగానే మరో రౌండ్​ సర్వే చేయాలని సూచించింది. జ్వరం వస్తే వారికి వెంటనే మందులు సరఫరా చేయాలని, అంతేకాకుండా కొవిడ్​ పేషెంట్లకు మెడికల్​ కిట్లు ఇవ్వాలని, ఒక గ్రామంలో ఎంతమందికి ఇచ్చారనే వివరాలను ప్రతిరోజూ నమోదు చేసి పంపించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

సర్వే చేయాల్సిందే

ఈసారి జ్వరంతో పాటు గర్భిణీల సర్వేను చేయాలని సూచించారు. కరోనా కట్టడయ్యేత వరకు నిత్యం సర్వే ఉంటుందని, ఒక విడత ముగియగానే మరో విడతలో ముందు నుంచి సర్వే చేయాలంటూ స్పష్టంగా తేల్చారు. మరోవైపు ఈ సర్వే భారం మొత్తం కిందిస్థాయి సిబ్బందిపైనే పడుతోంది. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ సిబ్బంది కాకుండా పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్​, మెప్మా సిబ్బందితో సర్వే జరిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం పరిశీలనకు వెళ్లి వస్తున్నారు. రోజువారీగా నివేదికలు, సర్వే వివరాలు, లోకేషన్లు పంపించాలంటూ ఒక విధంగా వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

సిబ్బందికి పాజిటివ్​

ఇక సర్వే సిబ్బంది ఇప్పటికే చాలా కష్టాల్లో పడుతున్నారు. ఒక కార్పొరేషన్​ పరిధిలో దాదాపుగా 300 మంది కాంట్రాక్ట్​ సిబ్బంది సర్వే చేస్తుంటే… అందులో 80 మందికిపైగా కరోనా బారిన పడుతున్నారు. పంచాయతీల్లో కూడా అదే పరిస్థితి. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి కరోనాతో చనిపోయాడు. గ్రామంలో సర్వే చేసిన సమయంలో కరోనా పాజిటివ్​గా తేలింది. అదే జిల్లాలో మెప్మా సిబ్బందిలో ఉన్న గర్భిణీకి పాజిటివ్​గా తేలింది. ఇలా చాలమంది సిబ్బందికి పాజిటివ్​ వస్తోంది. సర్వే సమయంలో వారిని వినియోగించుకుంటున్న అధికారులు వారికి కరోనా సోకితే మాత్రం కనీసం పలకరించడం లేదు. వారికి సరైన రక్షణ చర్యలు కల్పించడం లేదు. సర్వే సిబ్బందికి కనీసం మాస్క్​, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల ఇవ్వకున్నా ఇస్తున్నట్లు కాగితాల్లో లెక్కించుకుంటున్నారు. దీనిపై సిబ్బంది నిలదీస్తే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటి వరకు సర్వే..?

ప్రస్తుతం ఇప్పటికే ఒక దఫా సర్వే పూర్తి అయింది. సర్వే పూర్తి చేశామని ఊపిరి తీసుకునే సమయంలోనే మళ్లీ సర్వే చేయాలంటూ ఆదేశాలు రావడంతో సిబ్బంది ఉసూరుమంటున్నారు. రెండో దఫా సర్వే రాష్ట్రంలో శుక్రవారం నుంచి మళ్లీ మొదలైంది. ఇప్పుడు మళ్లీ జ్వరం, గర్భిణీల జాబితా తయారు చేస్తున్నారు. ఈసారి గర్భిణీల జాబితాలో చాలా మార్పులు చేశారు. వారి వివరాలు, ఫోన్​ నంబర్లు, ఆధార్​ నంబర్లు, డెలివరీ డేట్​, సమీప ఆస్పత్రి, వారు ప్రస్తుతం చూపించుకుంటున్న ఆస్పత్రి, తల్లిదండ్రుల వివరాలన్నీ తీసుకుంటున్నారు.

కాగా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు గ్రామ, మండల, మున్సిపాలిటీ అధికారులతో ప్రత్యేకంగా జూమ్​ ఆప్​ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్వే చేయాల్సిన అంశాలను వెల్లడించారు. అయితే కొన్ని గ్రామాల్లో కరోనా బాధితులకు వారి ఇండ్లలో వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి కచ్చితంగా గ్రామంలో వసతులు కల్పించాలని, ప్రభుత్వ భవనాలను క్వారంటైన్​ కేంద్రాలుగా మార్చాలని, దీనికి సంబంధించిన నిధులను పంచాయతీల నుంచి భరించుకోవాలంటూ సూచించారు.



Next Story