రిటైల్ అమ్మకాలకు కలిసొచ్చిన పండుగ సీజన్

by  |
రిటైల్ అమ్మకాలకు కలిసొచ్చిన పండుగ సీజన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో దెబ్బతిన్న వినియోగదారు వస్తువుల పరిశ్రమకు పండుగ సీజన్ ఎంతో కొంత ఉత్సాహాన్నిచ్చింది. 10 రోజుల నవరాత్రి సమయంలో రిటైల్ అమ్మకాలు గతేడాది స్థాయిని అధిగమించడమే కాకుండా బలమైన రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఈ విక్రయాలు ఆర్థికవ్యవస్థలో పునరుజ్జీవనానికి, వినియోగదారు విశ్వాసానికి సంకేతాలుగా భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది నెలలుగా బలహీనమైన అమ్మకాలతో ఉన్న పరిశ్రమకు ఈ డిమాండ్ సానుకూలంగా మారిందని ఎల్‌జీ ఇండియా సీనియర్ డైరెక్టర్ రవీందర్ చెప్పారు.

ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్మార్ట్‌ఫోన్ మిగిలిన అన్నిటికంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. కొత్తగా మార్కెట్లో లాంచ్ అయిన శాంసంగ్, యాపిల్, వన్ ప్లస్, షావోమి, ఒప్పో వంటి కంపెనీల మధ్య పోటీ విపరీతంగా ఉండటంతో స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి పండుగ సీజన్ కలిసొచ్చింది. ముఖ్యంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లు గతేడాది దసరా కాలంలో విక్రయించిన దానికంటే 50 శాతం ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలను నమోదు చేశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టీవీల విభాగంలో ఎల్‌జీతో పాటు శాంసంగ్, సోనీ, ఫిలిప్స్ కంపెనీల టీవీలకు డిమాండ్ రెండంకెల పెరుగుదలను నమోదు చేశాయి.

‘ఈ దసరా పడుగ సీజన్ పరిశ్రమతో పాటు ప్రజలకు కూడా భిన్నమైంది. ఈ పదిరోజుల కాలంలో 55 అంగుళాలు, అంతకంటే ఎక్కువ ఉన్న టీవీలు అసాధారణమైన వృద్ధిని నమోదు చేశాయి. ఇందులో టీవీలతో పాటు సౌండ్‌బార్ అమ్మకాలకు కూడా ఈ నవరాత్రి సానుకూలంగా ఉందని, ఈ డిమాండ్ దీపావళి పండుగ వరకు ఇది ఇలాగే కొనసాగుతుందనే నమ్మకం ఉందని’ సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ అన్నారు.



Next Story

Most Viewed