విదేశీ టీకా కంపెనీలతో సంప్రదింపులు

by  |
విదేశీ టీకా కంపెనీలతో సంప్రదింపులు
X

న్యూఢిల్లీ: దేశీయంగా టీకా కంపెనీల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు విదేశీ టీకా సంస్థలతో ముమ్మర చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా దిగ్గజ సంస్థలు ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మొడెర్నా సహా పలు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా వివరించారు. స్వల్ప మొత్తానికి తమ దేశానికి టీకాల దిగుమతి లేదా భారత్‌లోనే తయారీకి సంబంధించిన అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా సాగాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా ప్రాంత హెల్త్ పార్ట్‌నర్ల కొవిడ్-19 ఫోరమ్‌లో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా మాట్లాడారు.

ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మొడెర్నా లాంటి దిగ్గజ సంస్థలతో టీకా సరఫరాల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. భారత్ సెకండ్ వేవ్‌తో తీవ్రంగా బాధపడుతున్నదని, ప్రపంచంలో అందరికీ సకాలంలో టీకా అందడానికి, డబ్ల్యూ‌టీవోలోని నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని వివరించారు. అలాగే, స్పుత్నిక్ వీ వేగంగా ఇండియాలో ప్రవేశించడానికి అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. అలాగే, దేశీయ దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి కోసం ఎదరుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story