పనులు డొల్ల.. నాణ్యత కల్ల..!

by  |
పనులు డొల్ల.. నాణ్యత కల్ల..!
X

దిశ, కరీంనగర్ సిటీ : వృధానీటికి అడ్డు కట్ట వేస్తూ, భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు కొంతమంది గుత్తేదారులు గండికొడుతున్నారు. చేసిన పని పది కాలాల పాటు నిలిచేలా నాణ్యత పాటించాల్సిన వారు, తూతూ మంత్రంగా పనులు పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు విస్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తుండటంతో, మరింత పెట్రేగిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతమైన రామడుగు మండలంలో వృధా నీటిని ఒడిసిపట్టే క్రమంలో ఐదు చోట్ల చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టారు. వన్నారం, రామడుగు, మోతె,షానగర్, కొరటపల్లి గ్రామాల పరిధిలో వీటిని నిర్మిస్తున్నారు.

అయితే, నాసిరకం కంకర, నాణ్యత లేని సిమెంట్, రేగడి మట్టితో కూడిన ఇసుక వినియోగిస్తూ, నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. బెడ్ నిర్మిత ప్రదేశంలో కనీసం 5 ఫీట్ల లోతు మట్టి తీసి ఇసుక నింపాల్సి ఉంటుంది. అయితే కేవలం ఫీట్ లోతు మాత్రమే తీసి , అక్కడి ఇసుకనే తిరిగి నింపుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గ్రేడ్1 సామాగ్రి మాత్రమే పనుల్లో వాడాల్సి ఉంటుంది. నాణ్యతకు తిలోదకాలిచ్చిన గుత్తేదారులు, ఇవేమీ పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుపోతున్నారని, నాసిరకం పనులపై ప్రశ్నిస్తే అంతా మా ఇష్టం అంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికయినా ఉన్నతాధికారులు స్పందించి, పనుల నాణ్యతపై దృష్టి సారించాలని, లేనిపక్షములో కోట్లాది రూపాయలు నీటి పాలయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story