30 ఏళ్లు గడిచినా పదోన్నతులు లభించడం లేదని ఆ బ్యాచ్ కానిస్టేబుళ్ల ఆవేదన…

by  |
30 ఏళ్లు గడిచినా పదోన్నతులు లభించడం లేదని ఆ బ్యాచ్ కానిస్టేబుళ్ల ఆవేదన…
X

దిశ, లోకేశ్వరం: పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం లో చేరి 30 ఏళ్లు గడిచినా కనీసం హెడ్ కానిస్టేబుల్ గా అయినా పదోన్నతి లభించని పలువురు 1990 బ్యాచ్ పోలీసు కానిస్టేబుళ్ల దీనగాథ ఇది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఉద్యోగికి తమ సర్వీసు కాలంలో కనీసం మూడు పదోన్నతులు కల్పించాల్సి ఉండగా తమకు మాత్రం అమలు కావడం లేదని ఆ బ్యాచ్ కి చెందిన పలువురు కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా పదోన్నతి లభిస్తుందని కొండంత ఆశతో గత ఏడు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ఏఆర్(ఆర్ముడ్ రిజర్వుడ్) విభాగం నుంచి సివిల్ విభాగంలోకి బదిలీ అయిన కానిస్టేబుళ్లు సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన వారితో పాటుగా పదోన్నతి కల్పించాలని ఏఆర్ కానిస్టేబుళ్లు కోర్టుకు వెళ్లడంతో పదోన్నతి ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 2018 నుంచి హైకోర్టులో వంద వాయిదాలు అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కానిస్టేబుల్ గానే పదవి విరమణ పొందాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

2004 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ లకు లభించిన పదోన్నతి..

పోలీసు శాఖలోని ఆర్ముడ్ రిజర్వుడ్ విభాగంలో పనిచేస్తున్న 2004 బ్యాచ్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. కాగా 1990లో ఉద్యోగంలో చేరిన ఈ సివిల్ కానిస్టేబుళ్లు జూనియర్లకు సెల్యూట్ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అలాగే పని ఒత్తిడి తో పాటు మానసిక ఒత్తిడికి గురై నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని పలువురు కానిస్టేబుళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 32 ఏళ్ల సర్వీస్ కాలంలో కనీసం ఇప్పటివరకు రెండు పదోన్నతులు పొంది ఏఎస్ఐ స్థాయిలో ఉండాల్సిందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీరితో పాటు రెవెన్యూ శాఖలో చేరిన వారు ఎమ్మార్వోలయ్యారు..

1990లో వీరితో పాటు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరిన వారు ప్రస్తుతం ఎమ్మార్వోలుగా పదోన్నతి పొందారు కానీ వీరు మాత్రం ఇప్పటివరకు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నందున ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పలుమార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చలనం లేదని వారు వాపోతున్నారు.

Next Story

Most Viewed