కేసీఆర్ మాయలపకీర్ : పొన్నాల లక్ష్మయ్య

by  |
కేసీఆర్ మాయలపకీర్ : పొన్నాల లక్ష్మయ్య
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజల దృష్టి మళ్లించాడానికి కేసీఆర్ మాయలపకీర్ వేశాలు వేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పోతిరెడ్డిపాడుపై వివాదాలు తలెత్తే సమయంలో మంత్రివర్గ సమీక్షలతో కాలక్షేపం చేస్తున్నారని, కేసీఆర్‌కు దమ్ముంటే ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీతో చర్చించాలని ఆయన సవాల్ విసిరారు. ఆదివారం ప్రగతి‌భవన్‌లో సీఎం కేసీఆర్ గోదావరి జలాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంపై పొన్నాల లక్ష్మయ్య సోమవారం సోషల్ మీడియాలో స్పందించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. శ్రీరాంసాగర్ నుంచి లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎమ్‌డీ)కి నీళ్లు పంపిస్తున్నామని కేసీఆర్ చెబుతున్న మాట కాంగ్రెస్ ముందే చేసిందన్నారు. నీళ్ల పేరుతో రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయకుండా ప్రజల డబ్బులను నిరర్ధకం చేసేలా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రారంభిస్తే కేసీఆర్ దాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకూ చేపట్టిన ప్రాజెక్టు 2 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు.
గత ఏడాదిలో (ఎస్ఆర్ఎస్‌పీ) శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి వద్దకు 108 టీఎంసీల నీళ్లు వస్తే కేవలం 22 టీఎంసీల నీళ్లు వాడుకోగా 86 టీఎంసీలు నీళ్లు వృథా అవుతున్నాయన్నారు. కనీసం నికర జలాలు వాడుకోలేని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఏమీ చేసిందని ప్రశ్నించారు. నవంబర్ నుంచి మే వరకూ ఎన్ని టీఎంసీలు నీళ్లు ఎత్తిపోశారో అధికారికంగా లెక్కలు చెప్పగలరా అని నిలదీశారు. కాళేశ్వరంలో ఉన్న 2టీఎంసీల నీళ్లను వాడుకోలేని ప్రభుత్వం మరో టీఎంసీ గురించి డబ్బులు ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయడం సబబు కాదన్నారు. దోపిడి కోణంలో తెచ్చిన 3 టీఎంసీల టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed