రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి..

by  |
రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలు హస్తినకు చేరుతున్నాయి. హస్తిన కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్​ అంశం హాట్​ టాపిక్​గా మారిన నేపథ్యంలో అధ్యక్ష రేసులో ఉన్న ఎంపీ రేవంత్​రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. డిఫెన్స్​ కమిటీ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆయనకు సమాచారమిచ్చారు. రాహుల్​గాంధీతో కలిసి ఆ సమావేశంలో పాల్గొననున్నారు. దీంతో రాష్ట్ర పీసీసీ పీఠం ఆశిస్తున్న నేతల్లో కొంత ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లేందుకు పలువురు నేతలు సిద్ధమైనా… ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ హెచ్చరికలతో వాయిదా వేసుకున్నారు. కానీ రేవంత్​రెడ్డి అధికారికంగా ఢిల్లీకి వెళ్తుండటం కొంత అనుకూలంగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ వెంకట్​రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్​ నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి తీసుకుంటున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి 162 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్న మాణిక్కం ఠాగూర్ అధిష్టానానికి నివేదించారు.

ఈ సమయంలో ఢిల్లీకి వెళ్లేందుకు ఠాగూర్​ అడ్డుకట్ట వేశారని పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు రావచ్చంటూ బహిరంగంగా చెప్పినా… తన అనుమతి లేనిదే రావద్దంటూ ఠాగూర్ హెచ్చరించారు. సొంత పనులకు తప్ప పార్టీపరమైన అంశాల్లో మాత్రం తనకు సమాచారమిచ్చే రావాలంటూ సూచించారు. దీంతో సోమవారమే ఢిల్లీ వెళ్లాలని భావించిన పలువురికి బ్రేక్​ పడింది. ప్రస్తుతం రేవంత్​రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాలన్నీ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్ల రాష్ట్రంలో ప్రచారం సాగుతోంది. మొన్న సీఎం కేసీఆర్​, నిన్న బీజేపీ నేత బండి సంజయ్, ఇప్పుడు రేవంత్​రెడ్డి ఢిల్లీ వెళ్తుండటంతో… రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు.



Next Story