బీజేపీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్పించింది కిషన్ రెడ్డే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by  |
MP Revanth Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: జానారెడ్డి సవాల్‌ను ఎందుకు స్వీక‌రించలేదో హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స‌మాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏక‌గ్రీవం సాంప్రదాయాల‌ను తుంగ‌లో తొక్కిందే కేసీఆర్‌ అని, సాగ‌ర్‌లో ఓట్లు అడిగే నైతిక హ‌క్కు కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. మంగళవారం నాగార్జునసాగర్‌లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బాబాసాహెబ్ అంబేద్కర్ జ‌యంతి సంద‌ర్భంగా ట్యాంక్‌బ‌డ్ మీద ఆయ‌న విగ్రహానికి నివాళి అర్పించి కేసీఆర్ సాగ‌ర్‌కు రావాలని, సాగ‌ర్‌లో మీటింగ్ పెట్టే నైతిక హ‌క్కు కేసీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. జానారెడ్డి లాంటి నాయ‌కుడు ప్రజ‌ల‌కు, భ‌విష్యత్ త‌రాల‌కు అవ‌స‌రమని, అన్ని ప్రజా స‌మ‌స్యల‌కు జానారెడ్డి గెలుపు ఒక్కటే ప‌రిష్కారమని తెలిపారు. బీసీ నాయ‌కుడు ఈటల రాజేంద‌ర్‌ను టీఆర్ఎస్‌లో అవ‌మానిస్తున్నారని, ఈటల రాజేంద‌ర్‌ను క‌నీసం స‌మీక్షల‌కు కూడా పిల‌వ‌డం లేదని చెప్పుకొచ్చారు.

ఓట్ల కోసం బీసీ కులాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్రయ‌త్నం చేస్తున్నారని, బీజేపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి ద‌గ్గర ఉండి బీజేపీ నాయ‌కుల‌ను టీఆర్ఎస్‌లో చేర్పించారని సంచలన ఆరోపణలు చేశారు. సాగ‌ర్‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ మ‌ద్దతు ప‌లుకుతోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డి మ‌ధ్య విభేదాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కే ర‌వి నాయ‌క్‌కు బీజేపీ బీ ఫాం ఇచ్చారని, సాగ‌ర్‌లో బీజేపీకి డిపాజిట్ రాదని, ర‌వినాయ‌క్ ద్వారా కాంగ్రెస్ ఓట్లు చీల్చే కుట్ర చేశారని తెలిపారు. బీజేపీలో అంత‌ర్గత కుమ్ములాట‌లు అంద‌రికీ తెలుసని, ర‌వినాయ‌క్‌కు బీజేపీకి ఏం సంబంధం లేదని, ఓట్లు చీల్చేందుకు బ‌య‌ట‌కి వ్యక్తికి టికెట్ ఇచ్చారని చెప్పారు. న‌మ్మకద్రోహం, మిత్రద్రోహుల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్ అని, యూనివ‌ర్సిటీకి వ‌చ్చే ద‌మ్ము ధైర్యం బాల్క సుమ‌న్‌కు ఉందా అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed