ఆ పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by  |
MLC Jeevan Reddy
X

దిశ, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల పట్టణంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి, చెరుకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు అనేక హామీలిచ్చిన మాజీ ఎంపీ కవిత రైతులను రోడ్డున పడేశారని అన్నారు. అంతేగాకుండా.. ఎంపీగా గెలిచి ఆ ఫ్యాక్టరీనే మూయించి రైతులకు తీరని అన్యాయం చేశారని కవితపై జీవన్ రెడ్డి మండిపడ్డారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతులు పసుపు పంటను అధికంగా పండిస్తారని, అలాంటి రైతులను బాండ్ పేపర్‌తో నమ్మించి నట్టేట ముంచారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధుయాష్కీ గౌడ్ ఎంపీగా ఉన్న సమయంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల కోసం పోరాటం చేశాడని అన్నారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మధుయాష్కీ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం, దేవేందర్ రెడ్డి, శంకర్, దుర్గయ్య, మన్సూర్ అలీ, రామచంద్రారెడ్డి, అంజన్న, రాజేందర్, మధు, రఘువీర్ గౌడ్, నరేష్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed