‘ఒక్క అడుగు పడ్డా.. కేసీఆర్ రాజీనామా చేయాలి’

by  |
‘ఒక్క అడుగు పడ్డా.. కేసీఆర్ రాజీనామా చేయాలి’
X

దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడ్డా సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ ఎంపీ రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట ప్రజల ప్రయోజనాల కోసం నీళ్లు, నిధులు కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కేసీఆర్ ఏదో ఉద్దరిస్తాడని కాదని, ఆయన చెప్పే ఏ మాటకు విలువ ఉండదని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో దక్షిణ తెలంగాణ ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్, జగన్ దోస్తాన్ తెలంగాణ వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. జగన్ అసెంబ్లీలో పోతిరెడ్డిపాడుపై ప్రకటన చేసిన తర్వాత కూడా కేసీఆర్ స్పందించక పోవడం ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు. కాళేశ్వరం కంటే రెండింతలు నీరు ఏపీ తరలించుకుపోతుంటే కేసీఆర్‌కు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఉచితంగా గ్రావిటీ ద్వారా వచ్చే నీరు వదిలిపెట్టి గోదావరి నీళ్లపై మాట్లాడటానికి కేసీఆర్‌కు ఇంకిత జ్ఞానం ఉండాలని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్ ఉండగా దేశంలో ఎక్కడా ప్రాజెక్టు కోసం టెండర్లు పిలువలేదన్నారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ 8శాతం కమీషన్లకు ఆశపడి కాళేశ్వరం, దుమ్ముగూడెం ప్రాజెక్టులో ఎక్స్‌టెన్షన్ టెండర్లు పిలిచారని విమర్శించారు. జూన్ 2వ తేదీన ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నిరసన దీక్ష చేసేందుకు కాంగ్రెస్ సిద్దమవుతుందన్ని ఆయన తెలిపారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రాంత వాసి తెలంగాణకు ద్రోహం చేస్తే బొందపెట్టాలి.. ఇరత ప్రాంతాల వారు ద్రోహం చేస్తే తరిమికొట్టాలని ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన నినాదం అమలు చేస్తాం.. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణ ద్రోహిగా కేసీఆర్‌ను బొందపెడతామని’ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.

కాళేశ్వరంలో 90శాతం పనులు పూర్తిచేసిన కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై అడిగే దమ్ము టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్‌లు కూర్చోని పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు జీవో తెచ్చారని ఆరోపించారు. రాజకీయ బ్రోకర్ శాసన మండలిలో రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ తన పక్కన జోకర్లను పెట్టుకొని తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రతిపక్షం ఉందో లేదో నీ బిడ్డను అడుగు.. మేము బెదిరిస్తే భయపడమని కేసీఆర్‌కు వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు.

ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడుపై వీరోచిత పోరాటం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఏనాడు మాట్లాడలేదన్నారు. 2005లో పోతిరెడ్డిపాడుకు 44వేల క్యూసెక్కుల నీళ్లు తరలించడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవో తీసుకొస్తే కేసీఆర్ నోరు కూడా మెదపలేదన్నారు. ఆ నాడు పోతిరెడ్డిపాడుపై ఢిల్లీ నుంచి గల్లీ వరకూ పోరాటం చేసింది పీ.జనార్దనరెడ్డి అని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాత గేట్ల నుంచి ఏపీ అదనంగా 11వేల క్యూసెక్కుల నీళ్లు తరిలిస్తుంటే చేతులు ముడ్చుకొని కూర్చున్నరన్నారు. కేసీఆర్‌తో బంతి భోజనం తర్వాతనే జగన్ జీవో తెచ్చారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులపై నుంచి తీసుకెళితే వరద జలాలు.. కానీ 790 అడుగుల లెవల్లో తరలిస్తే వరద జలాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు.



Next Story

Most Viewed