బీజేపీలోకి విజయశాంతి ?

by  |
బీజేపీలోకి విజయశాంతి ?
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథి విజయశాంతి బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల నుంచి హస్తం పార్టీకి దూరంగా ఉంటున్న రాములమ్మను… మంగళవారం మధ్యాహ్నం కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కలవడం మరింత బలాన్ని చేకూర్చింది. దుబ్బాక బై‌ పోల్‌లో టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా దూకుడు మీదున్న బీజేపీ అందివచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగిస్తోంది. ఇదే క్రమంలో రంగంలోకి దిగిన కిషన్‌రెడ్డి.. విజయశాంతిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుండగా.. ఆమె కూడా సుముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక పూర్తి కాగానే విజయశాంతికి పార్టీలో పదవిపై కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర నేతలు సైతం విజయశాంతిని పార్టీలోకి రావాలని కోరడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే దుబ్బాక ఉప ఎన్నికకు ముందే విజయశాంతి కాషాయ కండువా కప్పుకుంటారని రాజకీయ విశ్లేషకుల నుంచి వినపడుతోంది. ఇప్పటికే ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కాస్తంత వెనకబడిందని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో విజయశాంతి బీజేపీలో చేరితే హస్తం పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని రాజకీయ శ్రేణులు భావిస్తున్నారు.


Next Story