‘దమ్ము, ధైర్యం ఉంటే అంబేద్కర్ చౌరస్తాకు రా తేల్చుకుందాం..’

by  |
Congress leader Vamsi Krishna
X

దిశ, అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతంలో ఈనెల 7వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఆదివాసీ గిరిజనులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగి దాదాపు పది రోజులు కావస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించకపోవడం దారుణం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట చెంచుల ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆఫీస్‌ను ముట్టడించారు. ఈ నిరసనకు హాజరైన వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నల్లమలలో గుప్త నిధులను కొల్లగొట్టేందుకు పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. నిధుల తవ్వకాలతో ఇంతవరకూ ఎవరూ బాగుపడిన సందర్భాలు లేవని, ఆయన కూడా తొందరలోనే నాశనం అవుతారని అన్నారు.

అంతేగాకుండా గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబాలకు తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పి కేవలం రూ.50 వేల అందజేసి చేతులు దులుపుకోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే బాలరాజు గుప్త నిధులు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘‘మీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ చౌరస్తా వద్దకు రా తేల్చుకుందాం. మీడియా సాక్షిగా నేను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తా’’ అని ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వంశీకృష్ణ సవాల్ విసిరారు. అలాగే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చెంచు నాయకులకు కొంతైనా బుద్ధి ఉండాలని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed