ఇద్దరు సీఎంల మధ్య చీకటి ఒప్పందం

by  |
ఇద్దరు సీఎంల మధ్య చీకటి ఒప్పందం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల్లో ఏపీ నీటి దోపిడీని అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత నాగం జనార్థన్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు సోమవారం లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి చట్టాలను ఉల్లంఘించి కృష్ణానది జలాల్లో తెలంగాణకు నష్టం చేశారన్నారు. పెన్నానది బేసిన్‌కు తెలుగు గంగ, జీఎన్ఎస్ఎస్, హంద్రినీవా, సోమశిల, కండలేరు, వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి నీటి చట్టాలను అతిక్రమించి సీడబ్ల్యూసీ అనుమతులు లేకున్నా మోసం చేసి నీటిని తరలించారని లేఖలో వివరించారు. తాజాగా జీవో 203, 388 ద్వారా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు పాల్పడుతున్నారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణా బేసిన్‌లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదని, ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీరు తీసుకుపోవాలంటే సదరు నదిలో సాగు, త్రాగునీరు అందిన తర్వాతే తీసుకుపోవాలన్న సోయి మరిచారన్నారు. ఏపీ ఇప్పుడు నీటిని తరలిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో రాయలసీమ ప్రజలు బ్రతకాలని, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు కృష్ణానది జలాలను తీసుకుపొమ్మని ఎందుకు చెప్పారని నాగం ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజలకి నష్టం కలిగేలా ఉందన్నారు. మిగులు జలాలు వాడుకునే హక్కులో కూడా కృష్ణా బేసిన్‌లోని వారికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, వాటి మీద ఆధారపడి కృష్ణా బేసిన్‌లో కడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్, ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు అభ్యంతరం చెప్పే హక్కు లేదని గుర్తుచేశారు. కృష్ణా మిగులు జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అవుతుందని, దీన్ని ఆంధ్రా ప్రభుత్వం అవకాశంగా తీసుకుంటుందన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ అండతోనేనని నాగం జనార్థన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.

ఏపీ సీఎంతో ప్రగతి భవన్‌లో సమావేశమైన తర్వాతనే ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. ఖచ్చితంగా దీనిలో రాజకీయ కుట్ర ఉందని నాగం ఆరోపించారు. దీనిద్వారా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతాయని, వాటిపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్‌బీసీ, ఏఎమ్మార్ పథకాలు పనికిరావన్నారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకి పెంచుతామంటే తెలంగాణ ఒప్పుకునేదా అని నాగం ప్రశ్నించారు. ఈ నీటి దోపిడీ వెనుక మీ మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఉందని, సుప్రీంకోర్టుకు వెళ్లి ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల్ని అడ్డుకొని రైతాంగం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నాగం సవాల్ విసిరారు.



Next Story