కమ్యూనిస్టులకు దూరంగా ఉండి తప్పుచేశాం : మధుయాష్కీ

by  |
Congress-leader-Madhu-Yashk
X

దిశ, వెబ్‌సైట్: ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అని, దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఒకే వేదిక మీదకు రావడం గొప్ప విషయం అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న మధుయాష్కీ మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మోడీ నియోజకవర్గం వారణాసిలో వందలాది కరోనా శవాలు కొట్టుకొచ్చాయని, ఇది మోడీ సర్కార్ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతుంటే ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేయడం ఏంటని తప్పుపట్టారు. అంబానీ, అదానీలకు ప్రభుత్వ కంపెనీలు కట్టబెట్టడానికి చూస్తున్నారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

ఇటు టీఆర్ఎస్‌పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అని విమర్శించారు. ఉద్యోగాలు కల్పించాలంటే వైన్ షాప్‌లో రిజర్వేషన్లు ఇస్తున్నారని కేసీఆర్‌కు చురకలంటించారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదని, రూ.వందల కోట్లతో పార్టీ భవనాలు, కలెక్టర్ ఆఫీసులు కడుతున్నారు కానీ, పేదలకు మాత్రం పక్కా ఇళ్లు కట్టించేందుకు మనసు రావడంలేదన్నారు. వరి వేస్తే ఉరి అని చెప్పే కేసీఆర్ రూ.లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. అనంతరం బీజేపీకి, కేసీఆర్‌కు మధుయాష్కీ గట్టి హెచ్చరిక చేశారు. కమ్యూనిస్టులతో దూరం పెరగడంతో మాకు నష్టం జరిగిందని, తెలంగాణలో 19 పార్టీల పునరేకీకరణ జరిగిందని, అన్ని పార్టీల కలయికతో మీ కోటలు బద్ధలు కొడతామని ఆయన అన్నారు.

Next Story

Most Viewed