సీఎం కేసీఆర్‌కు కొండా, కోదండరామ్ బహిరంగ లేఖ

by  |
Konda Vishweshwar Reddy, CM KCR, Professor Kodandaram‌
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్, పలువురు ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోందని, ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరపడం అమానుషం. మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం మొండిగా నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కరోనా వ్యాప్తికి ఏ రకంగా దోహదపడ్డాయో తెలుసు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, అనైతికం. ఎన్నికలు మరో ఆరునెలలు వాయిదా వేస్తే వచ్చే నష్టమేమీ లేదు. గత వారం రోజుల్లోనే 3-4 రెట్లు కోవిడ్ కేసులు ఎక్కువయ్యాయి.’’

‘‘కోవిడ్ సోకిన వారికి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేవు, మందులు అందడం లేదు, వైద్యానికి పరీక్షలకు ఎదురు చూడాల్సి వస్తుంది. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. కరోనాని కట్టడి చేయాల్సిన సమయంలో ఎన్నికలపై దృష్టి పెట్టడం బాధ్యతారాహిత్యం. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు సాకుగా చూపించి ఇక్కడ నిర్వహించడం అమానుషం. ఎన్నికలు అవాంఛనీయం. బలవంతంగా ఎన్నికలు జరిపి మరిన్ని ప్రాణాలు బలి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జీవించే హక్కును కాపాడే లక్ష్యంతో ఈ ఎన్నికల ఆపాలని కోరుతున్నాం.’’ అని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, సియాసత్ ఎండి జహీరుద్దీన్ అలీ ఖాన్, ప్రొఫెసర్ రమా మెల్కోటేలు ఉన్నారు.


Next Story