సొంత అల్లుడి చేతిలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు

by  |
సొంత అల్లుడి చేతిలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు
X

దిశ, బంజారాహిల్స్: ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన మనస్పర్థల కారణంగా సొంత మామనే చంపిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనకు రావాల్సిన కమీషన్‌ ఇవ్వకుండా తాత్సారం చేస్తుండడంతో ఆగ్రహంతో మామపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో బాధితుడు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం, గోటూరు గ్రామానికి చెందిన గౌని మోహన్‌రెడ్డి యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో అద్దెకు ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు వరుసకు మామ అయిన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్కొండ మండలం, సగినోనిపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.78లోని అర్బన్‌ ఒయాసిస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. రవీందర్‌రెడ్డి ఇటీవల బేగంపేటలో మోహన్‌రెడ్డి చూపించగా ఒక ప్లాట్‌ కొన్నాడు. ఇందుకు సంబంధించి రూ.6 లక్షలు మోహన్‌రెడ్డికి ఏజెంట్‌ కమీషన్‌ రావాల్సి ఉంది.

ఆరు నెలలుగా తిరుగుతున్నా ఇవ్వకపోగా ఇటీవల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న రవీందర్‌రెడ్డిపై మోహన్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకొని ఓ కత్తిని కొనుగోలు చేసి బుధవారం తెల్లవారుజామున రవీందర్‌రెడ్డి కిందికి వచ్చి కారు డోరు తీసే క్రమంలో కత్తితో తలపై బలంగా కొట్టాడు. కుప్పకూలిన రవీందర్‌రెడ్డిపై నాలుగైదుసార్లు విచక్షణారహితంగ కత్తి పోట్లకు గురి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రవీందర్‌రెడ్డిని అపోలో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

అయితే కత్తితో దాడి చేసిన అనంతరం మోహన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా హత్యకు గురైన రవీందర్ రెడ్డి నారాయణ పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పని చేశారు.


Next Story