జిల్లాలో కాంగ్రెస్ గాయబ్..

by  |
జిల్లాలో కాంగ్రెస్ గాయబ్..
X

దిశ, మేడ్చల్ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కనుసైగతో శాసించిన పార్టీకి.. నేడు జిల్లా స్థాయిలోనూ పెద్ద దిక్కులేకుండా పోయింది. పేరుకు బడా బడా నేతలున్నా.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను నడిపించే నాయకుడు లేక పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికలొచ్చినప్పుడు.. పోటీకి మేమంటే మేం సై అంటున్న నేతలు తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పార్టీ పరిస్థితి జిల్లాలో అధ్వానంగా మారిందనే చెప్పాలి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమేణా పడిపోతున్నా.. పట్టించుకునే నేతలే కరువయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రతిష్ట మరింత దిగజారుతుండగా.. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటూ బీజేపీ బలం పెంచుకుంటుందనేది వాస్తవం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం.

8 నెలల్లోనే 17.8 శాతం ఓట్లు గయాబ్..

మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో జవహర్ నగర్, నిజాంపేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ కార్పొరేషన్లు కాగా.. దమ్మాయిగూడ, నాగారం, మేడ్చల్, ఘట్‌కేసర్, పోచారం, తూంకుంట, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో టీఆర్ఎస్‌కు 44.50 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు మాత్రం 20.84 శాతం, బీజేపీ 12.75 శాతం ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన వారికి కాంగ్రెస్‌తో పోటీగా 19.13 శాతం ఓట్లు రావడం గమనించాల్సిన విషయం.
జిల్లాలోని ఏకైక పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి పరిధిలో కాంగ్రెస్‌కు 38.63 శాతం ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 37.93 శాతం, బీజేపీకి 19.47 శాతం ఓట్లు వచ్చాయి. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 17.8 శాతం ఓట్లు తగ్గాయంటే.. పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ప్రధాన సమస్య.. నాయకత్వ లేమి

ఉమ్మడి జిల్లా సమయంలో ఓవైపు సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వంటి నాయకులతో బలంగా ఉండేది. కానీ సబితా, సుధీర్ రెడ్డి పార్టీ మారడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ.. రాష్ట్ర స్థాయి ఫిగర్ కావడంతో కార్యకర్తలు అంత సులువుగా కలవలేకపోతున్నారు. దీంతో అక్కడో ఇక్కడో మిగిలిన నాయకులు సైతం టీఆర్ఎస్, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలుగుతుందా లేదా అన్నది చూడాల్సిందే.

Tags: Congress, Medchal Malkajgiri, Voting percentage, no leadership

Next Story

Most Viewed