బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

by  |
Niranjan
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం పరాయి దేశంలో ఉన్నట్లు, ఇప్పటివరకు ఎవరూ ఆలయానికి వెళ్లనట్లు ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ విమర్శించారు. గాంధీ భవన్‌లో సోమవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ 31 ఏళ్ల క్రితమే చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సభ నిర్వహించారని గుర్తుచేశారు. అంతేకాకుండా పాతబస్తీలో మత కల్లోలాలు జరిగినప్పుడు రాజీవ్ గాంధీ, ఫారుక్ అబ్దుల్లాతో వచ్చి ప్రతి బస్తీకి వెళ్లి బాధితులను పరామర్శించారని తెలిపారు. ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో సార్లు పాతబస్తీలో పర్యటించారని.. ఆ చరిత్ర సంజయ్‌కి తెలియదేమో అని అన్నారు.

అంతేకాకుండా 2012 దీపావళి వేడుకల్లో ఆలయ అలంకరణను మజ్లిస్ వారు అడ్డుకుంటే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆలయానికి అండగా ఉండి పూజలు జరిపించడాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వీటిని మరిచి తమ రాజకీయాల గురించి మతాన్ని వాడుకోవడం సరికాదన్నారు. వారు చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లను అడగకుండా మతతత్వాన్ని రెచ్చగొట్టి లబ్ధిపొందుతున్నారని విమర్మించారు.



Next Story

Most Viewed