పోలీస్ కస్టడీలో మహిళ మృతి.. ఎస్ఐని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ధర్నా

by  |
Congress dharna
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగూడుర్‌ మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న మహిళ అనుమానస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో పీఎస్ ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. వివరాళ్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన మరియమ్మ అడ్డగుడూర్ మండలానికి చెందిన బాలశౌరి ఇంట్లో మూడేండ్లుగా పనిచేస్తోంది. గత కొంతకాలంగా యజమానికి, ఆమెకి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో తాను ఇక్కడ పనిచేయలేనని ఆమె కొడుకును పిలిపించుకొని ఖమ్మంలోని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తన ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి మరియమ్మ రూ. 2 లక్షలు దొంగిలించిందని అడ్డగూడూర్‌ పీఎస్‌లో బాలశౌరి ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ మహేష్ ఎలాంటి విచారణ చేయకుండా మరియమ్మను అరెస్ట్ చేసి, విపరీతంగా కొట్టి, మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని నేరానికి కేసులు పెట్టి, దళిత మహిళను చిత్రహింసలకు గరిచేసి కస్టడీలోనే చంపేశారని, ఆమె మృతికి కారణమైన బాలశౌరి, ఎస్ఐ మహేష్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత మహిళ మరియమ్మ మృతికి కారణమైన ఎస్ఐ మహేష్‌ను సస్పెండ్ చేయాలని, మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేయని దొంగతనం ఆమెపై మోపి.. దళిత మహిళను ఖమ్మం నుండి మహిళా కానిస్టేబుల్ లేకుండా తీసుకొచ్చి, ఆమెను పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురిచేయడం అమానుశమన్నారు. కుటుంబసభ్యులను కనీసం డెడ్‌బాడీ కూడా చూడనివ్వకుండా చేసి.. రహస్యంగా రాజీ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం దర్యాప్తు జరిపి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

అనంతరం కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన వారిలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, కౌన్సిలర్లు ఈరపాక నరసింహ, పడిగెల ప్రదీప్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ బబ్లూ, ఎన్‌ఎస్‌యూ‌ఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, అందె నరేష్, బండారు ప్రశాంత్ రెడ్డి, పనుమటి ప్రశాంత్, శివ, తోట వేణు, ఎండీ అమనతుల్ల, కొల్లూరి రాజు, డాకురి ప్రకాష్, ఏలుగల రాజయ్య, పుట్టా గిరీష్ మనోహర్, సాయి తదితరులు ఉన్నారు.

Next Story